MP Kesineni: ఒకే పార్టీలో ఉన్నా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపి కేశినేని నాని మధ్య విబేధాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. కానీ రాజకీయాల్లో ఒక్కో సారి విబేధాలను పక్కన పెట్టి పార్టీ కోసం సహకరించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు కేశినేని అవసరం ఉమాకు పడింది. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీ ఫలితం రెండు ప్రధాన పార్టీలకు ఓ సవాల్ గా నిలిచింది. వైసీపీ, టీడీపీకి సమానంగా వార్డులు వచ్చాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా, 14 వార్డులు వైసీపీ, 14 వార్డులు టీడీపీ గెలుచుకుంటే ఓ స్వతంత్ర అభ్యర్ధిని విజయం సాధించారు. ఎన్నికల ఫలితం అధికారికంగా వెల్లడి కాకముందే స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన శ్రీలక్ష్మి కుటుంబంతో దేవినేని ఉమా చర్చలు జరిపి వారిని టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి పార్టీ కండువా కప్పించారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది.
MP Kesineni: కొండపల్లిలో ఎంపీ కేశినేని ఓటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓటుతో మళ్లీ సమాన స్థాయి ఏర్పడుతోంది. అయితే టీడీపీ విజయవాడ ఎంపి కేశినేని నాని ఈ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాసినా కమిషనర్ నుండి స్పందన లేకపోవడంతో కేశినేని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపి కేశినేని నాని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితాలను ప్రకటించవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారంకు వాయిదా వేసింది.
వైసీపీ, టీడీపీ క్యాంపుల్లో అభ్యర్ధులు
ఈ నెల 22వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ క్యాంప్ రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. గెలిచిన కార్పోరేటర్ లను ప్రత్యర్ధులు ప్రలోభాలకు గురి చేసి తమ వైపుకు తిప్పుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు తమ తమ అభ్యర్ధులను రహస్య ప్రదేశాలకు తరలించి క్యాంపు నిర్వహిస్తున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడి రాజకీయ పరిస్థితి ఉత్కంఠను రేపుతోంది.