MP Komatireddy : టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. తనపై విమర్శలు మానుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

కోమటిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు చెరుకు సుధాకర్ ను చంపేందుకు వందల సంఖ్యల్లో కార్లలో తిరుగుతున్నారని బెదిరించిన ఫోన్ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా దీనిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న భావోద్వేగంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వివరణ ఇచ్చారు. ఈ విషయానికి ఇక్కడితో వదిలివేయాలని ఆయన చెరుకు సుధాకర్ ను కోరారు. తన కొడుకుకు ఫోన్ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడడంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి చెరుకు సుధాకర్ నిన్న ఫిర్యాదు చేశారు.
రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలకు చెరుకు సుధాకర్ లేఖ రాశారు. బెదిరింపులపై చెరుకు సుధాకర్, ఆయన కొడుకు సుహస్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాదిలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి.ఈ ఉప ఎన్నికల సమయంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకొనే విషయమై తనకు సమాచారం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.