MP Nama Nageswararao: ఒక నాడు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన ముగ్గురు కీలక పారిశ్రామిక వేత్తలు నేడు బ్యాంకులకు రుణాల ఎగవేసిన అభియోగాలతో సీబీఐ ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడుగా ఉండి గడచిన సార్వత్రిక ఎన్నికల తరువాత బీజేపీలో చేరిన సుజనా చౌదరి, మాజీ టీడీపీ ఎంపి రాయపాటి సాంబశివరావు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు, ఒక నాడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా, టీడీపీకి బ్యాక్ బోన్ గా నిలిచిన వారు కావడం గమనార్హం.
MP Nama Nageswararao: ఈడీ తనిఖీలో కీలక పత్రాలు స్వాధీనం?
హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెం.19 లో ఉన్న నామా నాగేశ్వరరావు నివాసంతో పాటు రోడ్ నెం.36లో ఉన్న మధుకాన్ కంపెనీ, రాంచీ ఎక్స్ ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్ల ఇళ్లు కలిపి ఆరు చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు నోట్ల కట్టల లెక్కింపు మిషన్ లతో వెళ్లి తనిఖీలు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక పత్రాలు, డాక్యుమెంట్లు, పెద్ద మొత్తంలో నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటికి సంబంధించి అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. జార్ఖండ్ లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణపై ఈడీ తనిఖీలు నిర్వహించింది. దీనికి సంబంధించి 2019లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2020లో చార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టి తనిఖీలు నిర్వహించింది.
Read more: AP CID Sunil Kumar: శోధన – ఛేదన ఆయన ప్రత్యేకత..! సీఐడీకి ప్రత్యేక గుర్తింపు..!!
అసలు కేసు ఏమిటంటే..
2011 లో జార్ఖండ్ లో రాంచీ – రార్ గావ్ – జంషెడ్పూర్ మధ్య 163 కిలో మీటర్ల పొడవైన నేషనల్ హైవే – 33 పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకున్నది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ పద్ధతిలో ఈ పనులు తీసుకున్నది. ఇందు కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్ ప్రెస్ వే లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. మధుకాన్ సంస్థ ఈ ప్రాజెక్టు ను చూపి కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకు కన్సార్షియం నుండి రూ.1,029.39 కోట్లు రుణం తీసుకున్నది. ఆ తరువాత మధుకాన్ సంస్థలో అవకతకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించగా దర్యాప్తు చేసిన ఎస్ఎఫ్ఐఓ..మధుకాన్ తీసుకున్న రుణంలో రరూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్లు నివేదిక ఇచ్చింది. ఈ అంశంపై సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు జరుపుతోంది.
ఇక రాయపాటి సాంబశివరావు, ఆయన కుమారుడు రామారావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ 15 బ్యాంకుల నుండి తీసుకున్న రూ.8,832 కోట్ల రుణాల్లో దాదాపు రూ.3,822 కోట్లు దారి మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి. దీనిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతోంది. అదే విధంగా సుజనా చౌదరికి చెందిన కంపెనీలు బ్యాంకు ఆఫ్ ఇండియా కు రూ.322.03 కోట్లు రుణం ఎగవేతకు పాల్పడ్డారన్న కేసుతో పాటు షెల్ కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్ చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. వీటిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు సాగుతోంది.