నిత్యం వార్తల్లో ఉండడం… పార్టీకి వ్యతిరేకం కాదు అంటూనే వైసీపీ నేతలపై వ్యాఖ్యలు చేయడం… ఓ వర్గం మీడియాతో తరచూ మాట్లాడడం… ఇవీ వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామ్ కృష్ణం రాజుగారి దిన చర్యగా మారింది. ఈ మధ్య లేఖల ద్వారా కూడా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న ప్రధాని మోడీకి లేఖ రాసారు. “మీరు ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన బాగుందయ్యా, దయార్ద్ర హృదయ అంటూ” రాశారు. తాజాగా సీఎం జగన్ కి ఈ ఎంపీ ఓ లేఖ రాశారు. అయితే మొదటి సారి ఆయన ఓ కీలక అంశంపై తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా గురించి లేఖ రాశారు.
“సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు.. ఈరోజు జులై 4 , మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి. పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం సమీపంలోని మొగాళ్ళు గ్రామంలో అల్లూరి జన్మించారు. మా జిల్లాలో మీరు పాదయాత్ర చేసే సమయంలో జిల్లా పేరు మర్చి “అల్లూరి సీతారామరాజు” జిల్లాగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటే మాకు అదే భాగ్యం” అంటూ లేఖ రాసారు. ఇలా ఆయన ఎంపీ గా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం, జిల్లా కోరికపై మొదటిసారిగా ఆయన లేఖ రాయడం జిల్లాలో చర్చకు దారితీసింది. కేవలం రాజకీయాలు, గిల్లికజ్జాలు కాకుండా ఆ ప్రాంత ప్రజల మనోభావాలు రాజుగారు గమనించారని చెప్పుకుంటున్నారు. అయితే ఇదే సందర్భంలో జగన్ కి ఈ హామీ ని గుర్తు చేసి, మీరు నెరవేర్చలేదు అని నేరుగా ప్రశ్నించినట్టు కూడా ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.