ఏ పార్టీ అయినా ఎంపీకి, ఎమ్మెల్యేకో షోకాజ్ ఇస్తే కూసింత వణుకు ఉంటుంది. ఇంకాస్త బెరుకు ఉంటుంది. కానీ నరసాపురం రాజు గారికి అవేమి బొత్తిగా లేవు. ఉన్నా లోలోపల ఉన్నట్టున్నాయి. అందుకే పార్టీ ఇచ్చిన షోకాజ్ పై ఆయన తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. నేరుగా షోకాజ్ నోటీసుకి సమాధానం ఇచ్చి, తన పని ఏదో తాను చేసుకోపోకుండా.. ఎన్నికల కమీషన్ కి పిర్యాదు చేయడం, కేంద్ర పెద్దలను కలిసే ప్రయత్నాల్లో ఉండడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. నేరుగా ఢిల్లీ వెళ్లి తాడో పేడో తేల్చేందుకు సిద్ధమయ్యారు.
పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని.., అధ్యక్షుడుని విమర్శిస్తున్నారని… వివరణ కోరుతూ వైసీపీ జాతీయ కార్యదర్శి వినాయసాయిరెడ్డి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన ఎంపీ “రాష్ట్ర పార్టీకి జాతీయ కార్యదర్సుల వారూ” అంటూ సంబోధించారు. తనకి తోచిన సమాధానం ఇచ్చారు. ఇక్కడితో ఆగకుండా అసలు ఈ పార్టీ వాళ్ళది కాదని, పార్టీని స్థాపించినది వేరే ఉన్నారంటూ మెలిక పెట్టారు. అందుకే నేరుగా ఈసీకి పిర్యాదు చేసారు. ఇదేమిటో తేల్చాలంటూ కోరారు. అక్కడితో ఆగకుండా రేపు అమిత్ షా ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. ఒకవేళ అమిత్ షాని కలిస్తే మాత్రం ఈ రాజకీయం కాస్త మలుపు తిరుగుతుందేమో చూడాలి.