MP Raghurama: ఏపిలో ఉద్యోగ సంఘాల నేతలు రివర్స్ పీఆర్సీ మాకొద్దు అంటూ ఆందోళన గళం విప్పారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఏపి జేఏసి, ఏపి జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తిరస్కరిస్తున్నామని ఆ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజులు పేర్కొన్నారు. తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మద్దతు పలికారు.
MP Raghurama: ఢిల్లీలో నిరాహార దీక్ష
రివర్స్ పీఆర్సీకి నిరసనగా రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు రఘురామ కృష్ణంరాజు. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ తన నివాసంలోనే దీక్ష చేయనున్నట్లు రఘురామ తెలిపారు. ఉద్యోగులకు సీఎం జగన్ రివర్స్ పీఆర్సీ కానుక ఇచ్చారని సెటైర్ వేశారు. ఇలాంటి కోతలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు రఘురామ. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అన్నీ అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. ఈ అంశంలో ఉద్యోగ సంఘాలకు తాను సంఘీభావం ప్రకటిస్తున్నానని తెలిపారు రఘురామ. రాష్ట్రంలోని ప్రజలు కూడా ఉద్యోగులకు సంఘీభావం తెలియజేయాలని రఘురామ కోరారు.
సీఐడీకి చెప్పింది సాకేనా..?
తన ఆరోగ్యం సరిగా లేని కారణంగా సీఐడీ విచారణకు హజరు కాలేకపోతున్నాననీ లేఖ రాసిన రఘురామ ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావంగా దీక్ష చేస్తానని ప్రకటించడంపై వైసీపీ శ్రేణుల నుండి విమర్శలు వస్తున్నాయి. విచారణ ఎదుర్కొవడానికి అనారోగ్యం అంటూ సాకు చెప్పారనీ, అనారోగ్యంగా ఉన్న వ్యక్తి దీక్ష ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రఘురామ ఈ ప్రకటన చేయడంతో సీఐడీకి అనారోగ్యం అంటూ చెప్పింది సాకేనని స్పష్టం అవుతోంది. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.