MP RRR Case: వైసీబీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజుపై ఏపి సీఐడీ రాజద్రోహంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, ఆయన సుప్రీం కోర్టు ద్వారా బెయిల్ పొందటం తెలిసిన విషయమే. ఈ కేసులో మొదటి నుండి అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా సీఐడీ అడిషినల్ డీజీకి రఘురామ కృష్ణంరాజు లీగల్ నోటీసు పంపించారు. తన అరెస్టు సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్ ను తిరిగి ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్ ను రికార్డులో ఎక్కడా చూపలేదనీ, కోర్టుకు స్వాధీనం చేయలేదని తన ఫోన్ లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అంతే కాకుండా స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్ లోనే ఉందని, పార్లమెంట్ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో కోరారు. ఫోన్ తిరిగి ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
Read More: CPI Narayana: రాజద్రోహం చట్టంపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
మొదటి నుండి రఘురామ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. గుంటూరు ఆసుపత్రికి తరలించమని మెజిస్ట్రేట్ ఆదేశిస్తే గుంటూరు జైలుకు తరలించడం, ఆ తరువాత మెజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ హైకోర్టును సీఐడీ ఆశ్రయించడం, హైకోర్టు కోర్టు దిక్కార నోటీసు జారీ చేయడం, సుప్రీం కోర్టు ఆదేశాలతో రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించడం, సుప్రీం కోర్టు కండిషన్ బెయిల్ తో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి నేరుగా ప్రత్యేక విమానంలో రఘురామ ఢిల్లీకి వెళ్లడం, ఎయిమ్స్ లో పరీక్షలు చేయించుకోవడం ఇలా అనేక పరిణామాలు జరిగాయి.
ఇప్పుడు తాజాగా రఘురామ సెల్ ఫోన్ పంచాయతీ వెలుగులోకి వచ్చింది. అసలు సీఐడీ అధికారులు రఘురామ ఐ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై సీఐడీ అధికారులు ఏమి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.