MP RRR: ఏపిలో వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు అంశం హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. వైసీపీతో, సీఎం జగన్తో ఆయనకు ఎక్కడ తేడా వచ్చిందో ఏమో కానీ రెండేళ్లుగా వైసీపీ సర్కార్ తీరుపై, జగన్మోహనరెడ్డిపై విమర్శలు చేస్తూ కొరకరాని కొయ్యగా మారారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామ పాల్పడుతున్నారనీ, అతనిపై అనర్హత వేటు వేయాలనీ కోరుతూ వైసీపీ ఎంపీలు స్పీకర్ ఓంబిర్లాకు కలిసి ఫిర్యాదు అందజేశారు. దాదాపు ఏడాదిన్నర క్రితం నుండి ఆ ఫిర్యాదు స్పీకర్ వద్దే పెండింగ్ లో ఉంది. తాజాగా రెండు మూడు నెలల క్రితం కూడా పలు ఆధారాలతో మరో ఫిర్యాదు కూడా అందజేశారు వైసీపీ ఎంపీలు. దీనిపై స్పీకర్ ఓంబిర్లా రఘురామకు ఓ నోటీసులు ఇచ్చారు. ఇక లాభం లేదు రఘురామ నోటికి కళ్లెం వేయాలని ఏపి ప్రభుత్వం భావించింది.
ఏపికి వస్తే ఏదో కేసులో అరెస్టు చేస్తారనే..?
ఆ క్రమంలో ఏపీ సీఐడీ..రఘురామపై రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. జైలుకు పంపించింది. సీఐడీ విచారణ సమయంలో తనపై దాడి జరిగిందని రఘురామ ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న రఘురామ మళ్లీ రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్ కొనసాగిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చివరకు రఘరామ ఏమనుకున్నారో ఏమో తానే ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో అనర్హత వేటు పడుతుందన్న సమాచారంతోనే రఘురామ రాజీనామాకు సిద్ధపడ్డారంటూ వైసీపీ నుండి విమర్శలు రావడంతో ఫిబ్రవరి 5వ తేదీ వరకూ సమయం ఇస్తాననీ ఈ లోపు అనర్హత వేటు వేయించాలని సవాల్ చేశారు రఘురామ. అప్పటికీ వారి వల్ల కాకపోతే తానే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఏపికి వస్తే ఏదో కేసులో అరెస్టు చేసి మళ్లీ జైలుకు పంపుతారన్న భయంతో రఘురామ ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు.
Read More: KCR: తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ లో జగన్ పేరు ఎత్తి మరీ మెచ్చుకున్న కేసిఆర్..??
MP RRR: అనారోగ్య కారణంతో సీఐడీ విచారణకు డుమ్మా
తాజాగా ఇటీవల సంక్రాంతి పండుగకు తన స్వగ్రామం భీమవరం వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు రఘురామ. ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. రఘురామ హైదరాబాద్ వచ్చిన విషయం తెలుసుకున్న ఏపీ సీఐడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్లి 17వ తేదీ విచారణకు హజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న రఘురామ విచారణకు హజరు అవుతాననీ చెప్పారు. అయితే ఆయన భీమవరం పర్యటన రద్దు చేసుకుని అర్ధాంతరంగా ఢిల్లీకి వెళ్లిపోయారు. నిన్న సీఐడీ అధికారుల ముందు హజరు కావాల్సిన రఘురామ తనకు ఆరోగ్యం బాగాలేదనీ, సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసు కోర్టు విచారణలో ఉందనీ కావున తనకు నెల రోజులు సమయం కావాలంటూ సీఐడీ అధికారికి లేఖ రాశారు. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది తేలాల్సి ఉంది.
ఢిల్లీకి వెళ్లి అరెస్టు చేస్తారా..?
ఈ క్రమంలోనే రఘురామపై ఏపిలో మరో కేసు నమోదు అయ్యింది. సీఐడీ డీజీ సునీల్ కుమార్ ను దూషించారన్న అభియోగంపై కేసు నమోదు చేశారు. సీఐడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రఘురామ రాజీనామా విషయంలో వెనక్కు తగ్గినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటి వరకూ ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటిస్తూ వచ్చిన రఘురామ..రాజీనామాపై పునరాలోచన చేస్తానని పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా చూపి సీఐడీ విచారణకు డుమ్మా కొట్టిన రఘురామను తాజాగా నమోదు అయిన కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. ఇంతకు ముందు ఏపీ సీఐడీ అధికారులు ఆయన హైదరాబాద్ నివాసంలో ఉండగా వెళ్లి అరెస్టు చేశారు. ఇప్పుడు ఏపి పోలీసులు తాజాగా నమోదు చేసిన కేసులో ఢిల్లీకి వెళ్లి అరెస్టు చేస్తారా..? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. రఘురామ మరో పక్క సీఐడీ జారీ చేసిన నోటీసులపై న్యాయవాదులతో చర్చించారు. తాజాగా నమోదు అయిన కేసుపైనా హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి ఏమి జరుగుతుందో..?