RRR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని, ప్రభుత్వాన్ని నిత్యం ఏదో ఒక కారణం చూపుతూ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపి రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదనే చెప్పవచ్చు. పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో స్వపక్షంలో విపక్షం ఉండేది. అది జాతీయ పార్టీ కాబట్టి ఎవరికి వారే ఏమునా తీరే అన్నట్లు ఉండేది. కానీ ప్రాంతీయ పార్టీలో పార్టీ అధినేతను, ప్రభుత్వాన్ని స్వపక్షానికే చెందిన నేత విమర్శలు చేయడం చాలా అరుదు. ఒక వేళ అలా జరిగితే పిలిపించి ఆ వివాదాన్ని సరి చేసుకోవడమో లేక ఆ నేతను పార్టీ నుండి బహిష్కరించడమో చేస్తారు.
RRR: రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్ లు
కానీ రఘురామ విషయంలో వైసీపీ ఆ చర్యలకు పూనుకోలేదు. ఎందుకంటే పార్టీ నుండి సస్పెండ్ చేస్తే వైసీపీ ద్వారా గెలుపొందిన ఎంపీ స్థానాన్ని స్వతంత్రంగా అనుభవించే అవకాశం ఏర్పడుతుంది. అందుకే ముందుగా ఆయనపై అనర్హత వేటు వేసిన తరువాత పార్టీ నుండి బహిష్కరించాలన్న భావనలో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్నారు. సద్విమర్శలను ప్రభుత్వం స్పోర్టీవ్ గా చీసుకుంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా చేసుకోవచ్చు. దాదాపు రెండేళ్లుగా రఘురామ రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ తప్పిదాలను, జగన్మోహనరెడ్డి పాలనను విమర్శిస్తూ వస్తున్నారు.
విమర్శల్లో నిజం ఉందా..? లేదా..?
ఇంత వరకూ ఏపిలో ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు కూడా అన్ని సార్లు ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శించి ఉండరు. రఘురామపై అనర్హత వేటు కోసం వైసీపీ తీవ్ర స్థాయి ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడం లేదు. చివరకు తానే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతానంటూ రఘురామ ప్రకటించారు. వాస్తవానికి రఘురామ చేస్తున్న విమర్శల్లో నిజాలు ఉన్నాయా.. ఉంటే వాటిని ఎలా సరి చేసుకోవాలి అని ప్రభుత్వం ఆలోచించడం మంచిది అని అంటున్నారు. రఘురామ తమ పార్టీ, తమ ముఖ్యమంత్రి అంటూ వెటకారంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో ఆయన వెనక టీడీపీ ఉండి చేయిస్తుందని విమర్శిస్తున్నారే కానీ అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అన్నది గ్రహించడం లేదని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం మేల్కొని మంచి పాలన అందించేందుకు రఘురామ మంచే చేస్తున్నారనే వారు ఉన్నారు.