సాధారణంగా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని ఎవరైనా సరే మెచ్చుకుంటారు. కానీ తాజాగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ లో ధోనీ అనుసరించిన వ్యూహానికి అందరూ అతన్ని విమర్శిస్తున్నారు. ధోనీ ఆ మ్యాచ్ లో 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అప్పటికే చేయాల్సిన పరుగులు భారీగా ఉండడంతో చెన్నైకి ఆ మ్యాచ్లో ఓటమి తప్పలేదు. ధోనీ ముందుగానే బ్యాటింగ్కు వచ్చి ఉంటే చెన్నై గెలిచి ఉండేదని అందరూ అతన్ని విమర్శిస్తున్నారు. అయితే వాటి సంగతి పక్కన పెడితే ధోనీని మరో కొత్త రికార్డు మాత్రం ఊరిస్తోంది.
టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారతీయ ప్లేయర్ల జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను టీ20ల్లో 361 సిక్స్లు బాదాడు. తరువాతి స్థానంలో సురేష్ రైనా ఉన్నాడు. ఇతని సిక్స్ల సంఖ్య 311గా ఉంది. ఇక వీరిద్దరి తరుదవాత ధోనీ 298 సిక్సులతో 3వ స్థానంలో ఉన్నాడు. కానీ మరో 2 సిక్సర్లు బాదితే 300 సిక్సర్ల క్లబ్లో ధోనీ చేరనున్నాడు.
గత మ్యాచ్లో రాజస్థాన్ జట్టుపై చివరి ఓవర్లో ధోనీ వరుసగా 3 సిక్సర్లు కొట్టాడు. దీంతో టీ20 క్రికెట్లో అతని సిక్సర్ల సంఖ్య 298కు చేరుకుంది. మరో 2 సిక్సర్లను బాదితే చాలు.. అతను 300 సిక్సర్ల క్లబ్లో చేరుతాడు. ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీతో జరగనున్న మ్యాచ్ లో ధోనీ ఆ ఫీట్ను సాధిస్తాడని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.