జాతీయస్థాయిలో ఎంత భారీస్థాయిలో మెజారిటీ సంపాదించుకున్నా… దక్షిణాదిలో, ప్రత్యేకంగా ఏపీలో మాత్రం బీజేపీ ఎప్పుడూ మూడోస్థానం కోసం పోటీపడటమే జరుగుతుంది. దానికి కారణం ఇక్కడ బలమైన కేడర్ లేకపోవడం.. కనీసం గ్రామానికి ఒక్క కార్యకర్త కూడా లేని పరిస్థితి కలిగి ఉండటమే దీనికి కారణం. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా ఏపీలో జెండా ఎగరేయాలని గతంలో కంటే తీవ్రంగా కృషి చేస్తుంది బీజేపీ. ఇందులో భాగంగా వారు ఎంచుకున్న మార్గం ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా దగ్గర చేసుకోవాలనుకోవడం!
అవును… ప్రస్తుతం ఏపీలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన సామాజికవర్గాల్లో ఒకటైన కాపు సామాజికవర్గాన్ని ఓన్ చేసుకునే క్రమంలో కాపులపై ప్రత్యేక శ్రద్ధ చూపించే పనికి సిద్ధపడింది బీజేపీ. ఇందులో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం.. సోము వీర్రాజు సెకండ్ ప్లేస్ లో కొనసాగేలా స్పేస్ కల్పించడం జరిగింది. కానీ వీరికి తోడు మాస్ లీడర్ కావాలనే క్రమంలో పవన్ వైపు చూసింది.. పొత్తు కుదుర్చుకుంది. అయితే.. ఇది సరిపోదనే కామెంట్లు ప్రస్తుతం బీజేపీలో పెరుగుతున్నాయంట.
ఏపీలో పవన్ కంటే ముందు కాపులవైపు బలమైన స్వరంగా మారారు ముద్రగడ పద్మనాభం. కాపులపై పవన్ ది రాజకీయ ప్రేమ అయితే ముద్రగడది సామాజిక బాధ్యత అన్నస్థాయిలో ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ముద్రగడను వైకాపా సొంతం ఛేసుకుంటుందని అంతా భావించినా… జగన్ సీఎం అయ్యాక కూడా ముద్రగడ సైలంట్ గానే ఉన్నారు. ఈ క్రమంలో నిజంగా బీజేపీ టార్గెట్ ఏపీలో కాపులే అని భావిస్తే మాత్రం.. ముద్రగడ చాలా కీలకం కాబోతున్నారు.
బీజేపీ ముద్రగడను కాదని.. కేవలం పవన్ ని నమ్ముకునే వెళ్లాలని భావించిన పక్షంలో.. అధికారం సంగతి దేవుడెరుగు కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేరేమో అనే కామెంట్లు ముద్రగడ అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముద్రగడ ముఖ్యం అనడం అంటే… పవన్ ను కించపరచడమే అని కొందరు అంటుంటే… ఇప్పటికే 2019 లో ఒకసారి అయిపోయాకా మళ్లీ కించపరచడం ఏముంటుందని ఇంకొందరు సమాధానం ఇస్తున్నారు.! ఏది ఏమైనా… ముద్రగడ రాకుండానే, ముద్రగడ వర్గం లేకుండానే బీజేపీ ఆ సామాజికవర్గం ద్వారా పొందే లాభం చాలా తక్కువ అనేది ఆ సామాజికవర్గ జనాల అభిప్రాయంగా ఉంది.