Sachin Waze : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాల కారు కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జిలటెన్ స్టిక్స్ ఉన్న స్కార్పియో కారుని అంబానీ ఇంటి వద్ద నిలిపిన సమయంలో సస్పెన్షన్ కు గురై,ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ సచిన్ వాజే కూడా అక్కడే ఉన్నట్లు తమ వద్ద సీసీటీవీ ఫుటేజ్ ఉందని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి.
అంతేకాకుండా, ఆ కారులో ఉన్న జిలెటెన్ స్టిక్స్ను పోలీసు అధికారి సచిన్ వాజేనే కొనుగోలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయితే.. ఆ పేలుడు పదార్థాలను వాజే ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్నది మాత్రం చెప్పలేదు.
ఎన్ఐఏ అధికారుల కథనం ఏమిటంటే?
ఫిబ్రవరి 17న మాన్సుఖ్ హిరేన్ స్కార్పియోను ములంద్ ఎరోలీ రోడ్డులో నిలిపాడు. అదే రోజు పోలీసు హెడ్క్వార్టర్స్కు వచ్చి కారు తాళాలను సచిన్ వాజేకు ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత వాజే వ్యక్తిగత డ్రైవర్.. ఆ స్కార్పియోను తీసుకొచ్చి సాకేత్ హౌసింగ్ సొసైటీలోని సచిన్ వాజే నివాసంలో పార్క్ చేశాడు. ఫిబ్రవరి 24 రాత్రి వరకు స్కార్పియో.. పోలీసు అధికారి ఇంటి వద్దే ఉంది. ఫిబ్రవరి 25 రాత్రి 10 గంటలకు డ్రైవర్ స్కార్పియోను తీసుకెళ్లి అంబానీ ఇంటి సమీపంలో పార్క్ చేశాడు. కారు దిగి వెనకాలే తెల్లరంగు ఇన్నోవా కారులో ఫాలో అవుతూ వచ్చిన సచిన్ వాజే నడుపుతున్న ఇన్నోవాలో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
Sachin Waze : వాజే బెదిరింపు లేఖ కూడా పెట్టాడా?
సాక్ష్యాలను మాయం చేసేందుకు..కొద్ది గంటల తర్వాత సచిన్ వాజే మళ్లీ ఇన్నోవా కారులో వచ్చి స్కార్పియోలో బెదిరింపు లేఖ పెట్టి వెళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితులు కొన్ని సీసీటీవీ రికార్డులను ధ్వంసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను కూడా సేకరించనున్నట్లు ఎన్ఐఏ వర్గాలు చెప్పాయి.కాగా ఈ కేసులో ఇరుక్కున్న సచిన్ వాజేను మహారాష్ట్ర హోంమంత్రి నెలకు వంద కోట్ల రూపాయలను బార్లు రెస్టారెంట్లు నుండి వసూలు చేసి తనకు ఇవ్వాల్సిందిగా టార్గెట్ పెట్టినట్లు ఈ సంఘటన అనంతరం అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.వాజేనే తనకీ విషయాలన్నీ చెప్పినట్లు కూడా ఆయన వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.