రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ వ్యవహారశైలి మీద అధికార పార్టీ వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు వింటూ ..వారి పనులు చేసి పెడుతూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు రగిలిపోతున్నారు..
ఇక తమ పార్టీ అధికారంలో ఉండి తమకేమి ప్రయోజనం అని వారు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ మీద వారు తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఇన్చార్జి టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేయగా ఆయన తాను దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విషయానికొస్తే …రాజమండ్రి కమిషనర్ అభిషిఖ్త్ కిశోర్ కు వైసీపీ సిటీ ఇన్ ఛార్జ్ శివరామ సుబ్రహ్మణ్యం నడుమ గత కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. అదీ కరోనా సమయంలో మరింతగా ముదిరి పాకాన పడింది . కరోనా రాజమండ్రిలో వీర విజృంభణకు కారణం కమిషనర్ వైఖరే నని సుబ్రహ్మణ్యం బాహాటంగానే ప్రకటించేశారు. ఆయనకు నగరం పై అవగాహన లేకపోవడంతో కరోనా కట్టడిలో అట్టర్ ఫెయిల్ అయ్యారని చెప్పారు.
ఏ ఆసుపత్రిలో ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ఎక్కడ ఎలా చర్యలు తీసుకోవాలో కమీషనర్ కి తెలియడం లేదని శివరామ సుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు.అంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనలు వైసీపీ నేతలకు కమిషనర్ మీద కోపం తెప్పించాయి.పేద గర్భీణీలకు ఉపయోగపడే కొన్ని కేంద్రాలలో కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేయొద్దని, ప్రభుత్వ ఆసుపత్రికి సాధారణ రోగులు వెళ్లలేని పరిస్థితిలో ఈ ఆసుపత్రులు వారికి ఉపయోగపడతాయని వైసీపీ కమిషనర్ కి విన్నవించింది. అయితే నిర్ణయం జరిగిపోయిందని ,ఇక చేసేదేమీలేదని వైసీపీ నేతలకి చెప్పిన కమిషనర్ తరువాత టిడిపి వారు ఇదే విషయం మీద వినతిపత్రం ఇస్తే తన నిర్ణయాన్ని ఉపసంరి౦చుకున్నట్లు ప్రకటించారు.
అలాగే కరోనా సమయంలో నగరంలో పేద వర్గాలు నివశించే ప్రాంతాల్లో రహదారి విస్తరణ పనుల పేరుతో ప్రొక్లెయిన్లు పెట్టి కూల్చివేతలకు కమిషనర్ దిగుతున్నారని అదీ వైసీపీ ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్న చోట్ల చేస్తున్నారని వారు సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇలా అనేక సందర్భాల్లో టిడిపి కి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా కమీషనర్ వ్యవహార శైలి ఉండటం వల్ల వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ కి మరోసారి భంగపాటు తప్పదని అధికార వైసీపీ శ్రేణులు మొత్తుకు౦టునాయి. సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ఎలా సెటిల్మెంట్ చేస్తారో చూడాలి!