Municipal Elections : చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో 9,14,28 వార్డుల్లో తిరిగి నామినేషన్ లు దాఖలు చేసుకోవచ్చని ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఎస్ఈసీ ఆదేశించినా ఆ వార్డుల్లో నామినేషన్ లు దాఖలు చేయడానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధం కాలేదు. నామినేషన్లు ఎందుకు దాఖలు చేయడం లేదన్న విషయంపై పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అనీషారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనాధరెడ్డి లు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నామినేషన్లను టీడీపీ బహిష్కరిస్తుందని చెప్పారు.
పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 31 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ తిరిగి నిర్వహించాలని ఎస్ఈసీని కోరితే కేవలం మూడు వార్డుల్లో రీ నామినేషన్ లకు అవకాశం కల్పించడం అన్యాయమని అన్నారు. అవకాశం పొందిన ముగ్గురు అభ్యర్థులను వైసీపీ నాయకులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఇద్దరు అభ్యర్థులు అసలు ఎక్కడ ఉన్నారనే సమాచారం కూడా అందడం లేదని అన్నారు. ముగ్గురినే పోటీకి దింపి ఇబ్బంది పెట్టాలని భావించడం లేదని, ఇక్కడి వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు నిరసనగా తామే నామినేషన్ లు దాఖలు చేయడం లేదని వెల్లడించారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారనీ, సరైన సమయంలో వారికి తగిన బుద్ది చెబుతారని వారు పేర్కొన్నారు.