Munugode: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుండి. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా, 6వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు ప్రభాకరరెడ్డి, పాల్యాయి స్రవంతి రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు 40 మందిపైగా చిన్న చితకా పార్టీలు, స్వతంత్రులు బరిలో ఉన్నారు. అయితే ఉప ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు లేవు అన్న ప్రచారం జరుగుతుంది. అది ఎందుకు నిజం అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే..
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. పాల్వాయి స్రవంతి రెడ్డి గతంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి దాదాపు 20వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డి 2014 లో టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. 2018లో ఓటమి పాలైయ్యారు. ఈ అభ్యర్ధులు ఎవరి బలాలు, బలహీనతలు, ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. అయితే బీజేపీకి వ్యతిరేకతలు ఏమిటి అనే అయిదు పాయింట్ల విషయానికి వస్తే….
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సరైన కారణం లేదు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళుతున్నారు అంటే కచ్చితంగా సరైన కారణం ఉండాలి. సహేతుకమైన, సంబద్దమైన, సమ్మతమైన కారణం ఉండాలి. అంతే తప్ప నేను వేరే పార్టీలోకి వెళుతున్నాను. సో.. నేను రాజీనామా చేస్తున్నాను. నాకు మళ్లీ ఓట్లు వేసి గెలిపించండి అంటే ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి..? ఆయన పార్టీ మారుతున్నందుకు ప్రజలు మద్దతు ఇవ్వాలా ? అంటే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు ఓటర్లు మద్దతు ఇవ్వాలా. .? సో.. ఇదే బీజేపీకి ఇక్కడ పెద్ద అడ్డంకి. ఇదే మైనస్. పార్టీ మారితే వారికి ఓట్లు వేసి గెలిపిస్తే ఫిరాయింపునకు ప్రజలు మద్దతు ఇచ్చినట్లే కదా!. రాజ్యాంగ బద్దంగా, ప్రజాస్వామ్య బద్దంగా ఇది మంచి పద్ధతి కాదు. మునుగోడులో విద్యావంతులు, యువత, ఎంప్లాయిస్ ఓటర్లు దీన్ని ఆలోచిస్తున్నందున నెగిటివ్ ఉంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేశారా..? కాంగ్రెస్ వాళ్లు ఈయనను ఏమైనా ఇబ్బంది పెట్టారా ? అని ఆలోచన చేస్తున్నారు.
బీజేపీకి నియోజకవర్గంలో సంస్థాగత బలం లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పోలిస్తే మునుగోడులో బీజేపీకి సంస్థాగత బలం లేదు. 2018 లో ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాదాపు 90వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. భారీ మెజార్టీ వచ్చింది. 2014లో బీజేపీకి 27వేల ఓట్లు రాగా 2018లో సుమారు 12 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా నాలుగు మండలాల్లో సరైన కార్యకర్తల బలం కూడా లేదు. సరైన వ్యవస్థ కూడా లేదు. వాళ్లు కుత్రిమ బలం. తాత్కాలిక బలం పోగేసుకుని ఆ బలంతో ఉప ఎన్నికలకు వెళుతున్నారు. ఇది ఎంత మేరకు బీజేపికి ఉపయోగపడుతుందో చూడాలి.
హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కదా. మునుగోడు ఉప ఎన్నిక కూడా ఈజీగా గెలుస్తుంది అని చాలా మంది భావిస్తుంటారు. హుజారాబాద్ లో పరిస్థితి, దుబ్బాకలో పరిస్థితి వేరు. మునుగోడులో పరిస్థితి వేరు. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ కు సింపతీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అక్కడ బీజేపీ గుర్తు కంటే ఈటల రాజేందర్ వ్యక్తిగత ప్రభావం బాగా పని చేసింది. అయన అధికార పార్టీలో సుదీర్గకాలం ఉండి ఆ పార్టీ నుండి బహిష్కరించబడి, అధికార పార్టీ చేత అణచివేయబడిన నేపథ్యంలో తిరుగుబాటుతో ఉప ఎన్నికకు వెళ్లడం వల్ల ఆయన కు కలిసి వచ్చింది. ఆయన అయిదారు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కావడం మరో ప్లస్ పాయింట్. నియోజకవర్గంలో స్ట్రాంగ్ పునాదులు ఉన్న వ్యక్తి. అందుకే ఆయన బీజేపీ నుండి పోటీ చేసి ఈటల గెలిచారు. ఆయన ఒక వేళ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఉన్నా ఆయనే గెలిచేవారు. అక్కడ గెలుపు బీజేపీ గెలుపు అనే కంటే ఈటల గెలుపు అనడం సమంజసం. అదే విధంగా దుబ్బాకలో కూడా. అక్కడ రఘునందనరావు రెండు సార్లు పోటీ చేసి ఓడి పోయి ఉన్నారు. సింపతీ ఉంది. దానికి తోడు టీఆర్ఎస్ సంస్థాగతంగా చాలా తప్పులు చేసింది. ఇవి అన్నీ బీజేపికి కలిసి వచ్చాయి. దాంతో రఘునందరావు గెలిచారు. ఆ రెండు నియోజకవర్గాలతో మునుగోడును పోల్చకూడదు.
ఇక్కడ బీజేపీ తీవ్రంగా అధిగమించాల్సింది ఏమిటంటే.. అధికార టీఆర్ఎస్ ఇక్కడ స్ట్రాంగ్ వ్యూహంతో వెళుతోంది. బీజేపికి అధికార బలం లేదు. కేవలం ఆర్ధిక బలం మాత్రమే ఉంది. టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఆర్ధిక వనరులను సమకూరుస్తొంది. అయితే ఒక వ్యూహం అయితే లేదు. టీఆర్ఎస్ కు, కాంగ్రెస్ పార్టీకి తెరవెనుక పెద్ద వ్యూహాలు పని చేస్తున్నాయి. కేవలం బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యక్తిగత బలం, చరిష్మా, వర్గం మాత్రమే ఉన్నాయి. ఇది ఎంత మేరకు ఫలితం చూపిస్తుంది అనేది ఆలోచించాలి.
బీజేపీ అభ్యర్ధిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేసి వచ్చారు. అంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఓట్లు రావాలి. ఆయన సొంత బలంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వస్తేనే ఆయన గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్ని ఎక్కువ ఓట్లు చీలిస్తే ఆయన అంత బలపడినట్లు. నియోజకవర్గంలో బీజేపీ సంస్థాగత బలం కేవలం 15వేల ఓట్లు మాత్రమే. ఇక్కడ ముక్కోణపు పోటీలో గెలవాలి అంటే 70 నుండి 80వేల ఓట్లు సాధించాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి ఎన్ని వేల ఓట్లు తీసుకువెళ్లాడు అనేది చూడాలి.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నా. బలహీన అభ్యర్ధిని పోటీకి పెట్టినా అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశాలు మెరుగు అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బలమైన అభ్యర్ధి. మహిళా సెంటిమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి క్రేజ్ ఉంది. ఆయన కష్టం ఉంది. సో.. ఇక్కడ కాంగ్రెస్ బలంగా కనిపిస్తొంది. అభ్యర్ధుల పరంగా చూసుకుంటే ముగ్గురిలో కాంగ్రెస్ అభ్యర్ధి కొంత మేర స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. అందుకే కాంగ్రెస్ తో పోల్చుకున్నా బీజేపీ ఒక అడుగు వెనుక ఉన్నట్లే అంటున్నరు పరిశీలకులు. ఈ అయిదు పాయింట్ బీజేపీకి పెద్ద సవాళ్లు. వీటిని అధిగమిస్తే బీజేపీ గెలిచినట్లే. ఈ అయిదు రోజుల్లో బీజేపీ ఎంత మేరకు వీటిని నెగ్గుకుంటూ వస్తుందో చూడాలి మరి. తరువాయి కథనాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ బలహీనతలు పాఠకుల కోసం అందిస్తాం.
Rajampet Parliament: టీడీపీ వేడి నెలలోనే చల్లారింది ..! రాజంపేట పార్లమెంట్ లో ఎవరిది బలం ..!?