ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ను ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్న నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి తానే అభ్యర్ధినని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ప్రభాకరరెడ్డి అభ్యర్ధిత్వాన్ని నియోజకవర్గంలోని పలువురు నేతలు వ్యతిరేకిస్తుండటంతో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని ఆయన చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రగతి భవన్ నుండి కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులకు పిలుపు రావడంతో కొద్దిసేపటి క్రితం భూపాల్ రెడ్డి ఆయన అన్న కృష్ణారెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ప్రగతి భవన్ నుండి వీరికి పిలుపు రావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
మునుగోడు నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న కృష్ణారెడ్డి.. యాక్టివ్ గా పని చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజికవర్గం నుండి కర్నే ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరో పక్క ప్రభాకరరెడ్డికి టికెట్ ఇవ్వవద్దంటూ నియోజకవర్గంలోని 300 మంది నాయకులు ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రభాకరరెడ్డి సన్నిహితుడు కావడంతో టికెట్ పై ధీమాగా ఉన్నారు. అయితే నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రభాకరరెడ్డి అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తుండటం మంత్రి జగదీశ్ రెడ్డి కి తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో అసమ్మత్తులను బుజ్జగింపుల పర్వానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఈ రోజు కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులతో చర్చించిన తర్వాత అభ్యర్ధి ఎంపిక విషయంలో ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన జరపతలపెట్టిన భారీ బహిరంగ లోపుగానే అభ్యర్ధి ప్రకటన జరగవచ్చని అనుకుంటున్నారు. ప్రధానంగా అయిదుగురు నేతలు టికేట్ ఆశిస్తుండగా వారిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి.