టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ తన భవిష్యత్తు గురించి ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అతను పూర్తిస్థాయి రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు చెప్పేశారు. ఇక నుండి తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండదు అని తేల్చేశారు. ఇక అతను పూర్తిగా జీవితంలో విశ్రాంతి తీసుకోవడానికి మాత్రం ఇష్టపడటం లేదు. రాజకీయాల నుండి రిటైర్ అయిపోయారు కానీ సినిమాల్లో మాత్రం యాక్టివ్ గా కొనసాగుతానని తెలిపారు.
చివరిగా ‘అతడు’…!
నటుడిగా సినిమాలు చేస్తూనే తన జయభేరి ప్రొడక్షన్ బ్యానర్లో సినిమాలను కూడా చేస్తానని వెల్లడించారు. ఒకప్పుడు ఈ సంస్థ స్థాపించిన మురళీమోహన్ తన బ్యానర్లో చాలా పెద్ద సినిమాలు తీశారు. నాగార్జున హీరోగా నిర్ణయం, ఆవిడే మా ఆవిడ చిత్రాలు ఆయన నిర్మించినవ్. తన సంస్థలో చివరగా వచ్చిన సినిమా ‘అతడు’. 2005 లో వచ్చిన ఆ సూపర్ హిట్ చిత్రం తర్వాత ఇక జయభేరి సంస్థ కనిపించలేదు.
సినిమాలా… వెబ్ సిరీస్ లా…?
థియేటర్ల వద్ద ‘అతడు’ అనుకున్న స్థాయిలో ఆడకపోయినా ఆ చిత్రం వల్ల నష్టాలు కూడా రాలేదు. ఇక కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం తర్వాత సినిమాలను నిర్మించడం ఆపేసింది ఆ సంస్థ. ఇక మళ్లీ ఇన్ని రోజులకు మురళీమోహన్ పునః ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ సంస్థలో ఎలాంటి సినిమాలని నిర్మించాలి… వెబ్ సిరీస్ లు కూడా నిర్మించాలా అన్న విషయంపై చర్చిస్తామని మురళీమోహన్ అన్నారు.
ఎలాంటివి నిర్మించాలి?
ఇప్పటివరకు జయభేరి బ్యానర్ లో 25 సినిమాలు వచ్చాయి. వ్యాపారాలు, రాజకీయాల్లో బిజీగా ఉండటంవల్ల సినిమాలు నిర్మించలేకపోయానని మురళీమోహన్ వెల్లడించారు. ఇక తన దృష్టి అంతా సినిమాల పైనే ఉంటుందని నటుడిగా ఎలాంటి సినిమాలు చేయాలి… నిర్మాతగా ఎలాంటి సినిమాలు రూపొందించాలి అన్న విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఇంకా ఒక ఆలోచనకు రావాలని అన్నారు.
అయితే ఏదో ఒకటి మాత్రం త్వరలోనే మొదలు పెట్టేస్తాను అని మురళీమోహన్ నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్కా మీడియా వారు రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు ఇందులో తన కొడుకులుగా జగపతిబాబు, శరత్ కుమార్ కనపడనున్నట్లు మురళీమోహన్ వెల్లడించారు.