murder attempt: ఓ 65 ఏళ్ల వృద్ధుడి హత్య చేసేందుకు ఓ ప్రభుద్దుడు అతని నోటిని దారంతో కుట్టేసి బలవంతంగా తీసుకువెళ్లి రైల్వే ట్రాక్ పై పడేసి తాళ్లతో కట్టేసి వెళ్లిపోయారు. అయితే ఆ వృద్ధుడికి భూమిపై నూకలు ఉన్నట్లు ఉన్నాయి. రైలు రాకమునుపే అటుగా బహిర్భూమికి వెళుతున్న కొందరు గ్రామస్తులు రైల్వే ట్రాక్ పై ఆ వృద్ధుడిని చూసి కాపాడారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఫలామూ జిల్లాలో ఇటీవల వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోలా రాం (64) కొన్నేళ్ల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య సబితా దేవికి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. అయినా ఆమెను బోలారాం వివాహం చేసుకున్నాడు. ఆమె కుమారుడికి తల్లి వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. అతనిపై పగ పెంచుకున్న సబితా దేవి కుమారుడు ఎలాగైనా బోలారాంను అంతం చేయాలని భావించాడు. అందుకు ఓ పథకాన్ని రచించి బుధవారం రాత్రి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బోలారాంపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టడంతో పాటు బలవంతంగా పెదాలను తాడుతో కుట్టేశాడు. ఆ తరువాత కాళ్లు చేతులు కూడా బంధించి, గ్రామానికి దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు తీసుకువెళ్లారు. రైల్వే ట్రాక్ పై పడేసి వెళితే తప్పించుకుని వెళతాడని రైలు పట్టాలకు బోలారాంను తాడుతో కట్టేసి పట్టాల మధ్యలో పడేసి వెళ్లిపోయారు.
అయితే గురువారం తెల్లవారుజామున అయిదు గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళుతున్న ఓ గ్రామస్తుడు రైలు పట్టాలపై మనిషి ఉండటాన్ని గమనించి వెంటనే రాళ్లతో అతని కట్లు తెంపి అతన్ని రక్షించాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న మరి కొందరు గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భోలారాం ను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి నోటికి ఉన్న కట్లు తీయించారు. ఆ తరువాత భోలారాం నుండి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.