ఒడిశా రాష్ట్రంలోని ఒక జిల్లా కలెక్టర్పై హత్య కేసు నమోదు కావడం తీవ్ర సంచలనం అయ్యింది. మల్కాన్గిరి జిల్లా కలెక్టర్ మనీష్ అగర్వాల్పైన, ఆయన కార్యాలయంలో పని చేసే మరో ముగ్గురిపైనా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
ఎందుకంటే..కలెక్టర్ మనీష్ అగర్వాల్ పర్సనల్ అసిస్టెంట్ దేబనారాయణ పాండే గత ఏడాది డిసెంబర్ 27న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. డిసెంబర్ 27న డ్యూటీకి వెళ్లిన పాండే ఆ రాత్రికి ఇంటికి చేరుకోలేదు. మరుసటి రోజు మల్కాన్గిరిలోని సతిగూడ డ్యామ్లో పాండే మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ నేపథ్యంలో పాండే భార్య కలెక్టర్ మనీష్, ఆయన కార్యాలయంలో పని చేసే అధికారులపైనా ఆరోపణలు చేసింది. తన భర్తకు కలెక్టర్ మనీష్ తో పాటు మరో ముగ్గురి అవినీతి గురించి తెలుసు అని, అందుకనే తన భర్తను వారే హత్య చేసి ఉంటారని కోర్టును ఆశ్రయించింది. వారిపై హత్య కేసు నమోదు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆమె మెజిస్ట్రేట్ను అభ్యర్థించింది. హత్య ఆధారాలు లభించకుండా చేయడం కోసం కలెక్టర్ కార్యాలయంలో సీసీ ఫుటేజీని కూడా మారం చేశారని ఆమె ఆరోపించింది. దీంతో జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్తో పాటు మరో ముగ్గురిపై హత్య కేసు నమోదు చేశారు. అదే విధంగా కేసు దర్యాప్తునకు కోర్టు ఆదేశాలతో సిట్ ను కూడా ఏర్పాటు చేశారు.
పాండే అనుమానాస్పద మృతి చెందిన సమయంలో కాంగ్రెస్ పార్టీ..ఇది కచ్చితంగా హత్యేననీ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసింది.