భూమిపై అంతుచిక్కని రహస్యాలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి. వాటిలో ప్రదేశాలు, వివిధ రకాల జంతువులు, పలు ప్రాంతాల్లో జరిగే సంఘటనలు లాంటివి. అలా అంతుచిక్కని, అరుదైనవి వెలుగులోకి వచ్చినప్పుడు ఒక్కో సారి భూమితో పాటు జీవులు నివసిస్తున్న గ్రహాలు ఉన్నాయనీ, గ్రహాంతరవాసులే ఈ పని చేసి ఉంటారని అనిపిస్తుంటుంది. అలాంటి అంతుచిక్కని వస్తువులు, ప్రదేశాలు చూసినప్పుడు గ్రహాంతరవాసులపై అంతరూ అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు.
తాజాగా గ్రహాంతరవాసుల చేసిన పనే ఇది అంటూ ఓ ఘటన వార్తల్లో నిలుస్తూ.. తెగ వైరల్ అవుతోంది. అదే.. అమెరికాలోని ఓ ఏడారిలో పాతివున్న ఓ లోహశిల. యూఎస్లోని యూటాలోని రెడ్ రాక్ ఎడారిలో పాతివున్న ఒక లోహశిలను అక్కడి ప్రజా భద్రతా, వణ్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. ఎత్తుగా ఉన్న ఒకే ఒక్క లోహశిల (స్టెయన్ స్టీల్తో చేసినదిగా ఉంది) అక్కడ ఉంది. దీనిపై అమెరికాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
దీనిపై అక్కడి ప్రజా భద్రతా, వన్యప్రాణి విభాగం అధికారులు మాట్లాడుతూ.. తమ విభాగం వన్య ప్రాణుల వివరాలను, ప్రస్తుత పరిస్థితులను తెలుసుకోవడానికి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే యూటాలోని ఆగ్నేయ ఎడారి ప్రాంతంలో… మెరుస్తూ ఓ వస్తువు కనిపించింది. వేంటనే తమ సిబ్బంది ఆ ప్రాంతంలో హెలికాప్టర్ ను ఆపి.. దిగి దానిని చూశారు. అది ఒక లోహ స్థంభం. దాని ఎత్తు దాదాపు 12 ఫీట్ల వరకూ ఉంటుంది. ఆ లోహ స్థంభం స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసినదిగా ఉంది.
అయితే, దీనిపై అనేక ప్రశ్నలు వస్తూ.. తీవ్ర చర్చకు ఈ స్థంభం తెరలేపింది. ఎందుకంటే.. ఆ లోహస్థంభం ఉన్నది యూటాలోని రెడ్ రాక్ ఎడారిలో. మరీ ముఖ్యంగా ఇది మారుమూల ప్రాంతం. ఇలాంటి ప్రదేశంలోకి ఈ స్థంభం ఎలా వచ్చింది? ఎందుకు? ఎవరు తీసుకొచ్చి ఉంటారు అనే విషయాలు ఇంకా తెలియలేదు. అయితే, దీనిపై దర్యాప్తు చేయడానికి బ్యూరో ఆఫ్ ల్యాండ్స్ మేనేజ్మెంట్ అధికారులు త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఇలా ఎడారిలో లోహ స్థంభాన్ని పాతిపెట్టింది గ్రహంతర వాసులేననీ, ఇలాంటి పనులు వారే చేస్తారంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.