చేతికి ఎముక లేనట్లు వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా పేదలకు ఉపకరిస్తున ఒక పథకం విషయంలో వెనక్కి తగ్గారు.
అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు పేదలు అడగనిది కూడా అందించిన ఘనత ఆయనది. అలాంటి ముఖ్యమంత్రి చేతులను ఆంధ్రప్రదేశ్ ను పట్టిపీడిస్తున్న నిధుల లేమి కట్టిపడేసింది. దీంతో చేసేది లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పథకాన్ని ఉపసంహరించుకుంది. విషయానికొస్తే కరోనా బాధితులు ఆస్పత్రులనుంచి కోలుకుని ఇంటికి వెళ్లే సమయంలో 2వేల రూపాయలు ఆర్థిక సాయాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజులుగా అందజేస్తోంది . కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్ళిన రోగులు మరి కొద్ది కాలం పాటు ఖర్చులకు వాడుకునేందుకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. నిజానికి ఇది చాలా మంచి సాయం.అయితే ఇది అనుకున్నన్ని రోజులు సాగలేదు.
నిధులలేమి కారణంగా ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. రోజుకు దాదాపు అర కోటి రూపాయలు అవసరం అవుతుండడంతో ఆర్థిక వనరులు సమకూరని ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ పథకానికి మంగళం పాడింది.రోజుకి 10వేలమందికి పైగా కొత్తగా కరోనా బారిన పడుతున్నారు. దాదాపుగా ఇదే సంఖ్యలో బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తున్నారు. వీరందరికీ 2వేలు ఆర్థిక సాయం చేయాలంటే రోజుకి కనీసం 2కోట్ల రూపాయలు కేటాయించాలి. పోనీ ప్రైవేట్ ఆస్పత్రులను మినహాయించినా, హోమ్ ఐసోలేషన్ లో వారిని వదిలేసినా రోజుకి 50లక్షల మేర ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అసలీ పథకానికి ప్రభుత్వం తొలివిడత కేటాయించింది కేవలం 10కోట్ల రూపాయలు మాత్రమే. ఇప్పటి వరకూ సుమారు 20కోట్ల రూపాయలు ఇలా కరోనా బాధితులకు అందించినట్టు లెక్కలున్నాయి.
ఈ నేపథ్యంలో రోజు రోజుకీ ఖర్చు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం చేతులెత్తేసింది. కరోనా బాధితులకు ఇస్తామని చెప్పిన 2వేల రూపాయల సాయానికి మంగళం పాడేసింది.యితే ప్రభుత్వ వర్గాలు, అధికారులు చెబుతున్న కారణాలు కూడా సహేతుకంగానే ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి కరోనా కిట్లు పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నవారికి పౌష్టికాహారం అందిస్తున్నామని, దానికి అదనపు నిధులు ఖర్చవుతున్నాయని చెబుతున్నారు అధికారులు.
అందుకే ఆర్థిక సాయాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించారు.ప్రతిపక్షాలు మాత్రం దీన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నాయి. డబ్బులు ఇవ్వలేమని తెలిసి కూడా అట్టహాసంగా ప్రకటించడం దేనికి అని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇలాంటి ప్రకటనలిచ్చారని, తీరా చేతులెత్తేశారని విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం మరేదైనా ప్రత్యామ్నాయాన్ని ప్రకటిస్తుంది ఏమో చూడాలి.