ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలో ఉన్నా చిరునవ్వుకే చిరునామాగా ఉండేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2009 సెప్టెంబర్ 2వ తేదీన అదే ధీరత్వంతో ఉన్నారు. ఉదయం 7:15 గంటల సమయంలో జగన్ తో మాట్లాడుతూండగా వర్షాలు పడుతున్నాయని వద్దని ఫోన్ వచ్చినా.. పనులు పెట్టుకున్నాం కదా.. ఎయిర్ పోర్టుకు వెళ్లాక చూద్దాంలే అన్నారు. వర్షాలు కదా ఎందుకని సతీమణి చెప్పినా.. పైలట్ చెప్తే వచ్చేస్తాలే అన్నారు. రచ్చబండ కార్యక్రమం కోసం బయలుదేరుతున్న సమయంలో జరిగిన ఈ సంబాషణల్లో తను ప్రజల కోసం అనుకున్న పనిలో వెనకడుగు వేయదలచుకోలేదు. అదే చిరునవ్వుతో సరిగ్గా 7:45 గంటలకు బయలుదేరారు. కారులో ఆయనతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ అరవిందరావు, సీఎస్ఓ వెస్లీ, సూరీడు ఉన్నారు. కారులో ఏమీ మాట్లాడుకోలేదు. ఎయిర్ పోర్టులో ఫైల్స్ మీద సంతకాలు, సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏం సంకేతమో ఏమో.. ఎప్పుడూ లేనిది ఎయిర్ పోర్టు స్టాఫ్, ఇంటెలిజెన్స్ స్టాఫ్తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు దిగారు. హెలికాప్టర్ ఎక్కేముందు వైఎస్ లో ఎప్పుడూ ఉండే చిరునవ్వు ఆరోజు లేదట. పాత చాపర్ ఎందుకు పెట్టారు అని అడిగితే.. ఏం సమాధానం చెప్పారో తెలీదు. 8:34కి చాపర్ బయలుదేరింది. జరగబోయే విపరీతాలకు ఇవి సంకేతాలుగా మిగిలాయి.
శంషాబాద్ ఏటీసీ.. తిరుపతి ఏటీసీకి సంబంధాలు కట్..
సరిగ్గా 12:30కి ప్రేయర్ ముగించుకున్న విజయమ్మ వద్దకు సురీడు వచ్చి.. ‘సార్ వెళ్లిన చాపర్ మిస్సింగ్ అట అమ్మా’ అని చెప్పాడు. టీవీలో బ్రేకింగ్స్ చూసి కొద్దిగా కంగారుపడ్డా.. ధైర్యంగానే ఉన్నారు విజయమ్మ. బంధువులు రాగా ఆమె బైబిల్ తీసి చదవటం మొదలుపెట్టారు. మధ్యమధ్యలో భర్త గురించి ఆరా తీస్తూనే ప్రేయర్ చేస్తున్నారు. మధ్యలో ఆడబిడ్డ విమల.. అన్న క్షేమం అట వదినా.., సెల్ ఫోన్స్ సిగ్నల్స్ ఆధారంగా నాలుగు కిమీ పరిధిలో గాలింపు మొదలెట్టారట.. అనే మాటలు వినిపిస్తున్నాయి విజయమ్మకు. 1:30కి బెంగళూరులో ఉన్న షర్మిలకు, భారతికి విషయం తెలిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్షేమంగా ఉంటారనే ధైర్యంతోనే వారూ జగన్ కూడా ఉన్నారు. సాయంత్రానికి షర్మిల, భారతి హైదరాబాద్ లో విజయమ్మ దగ్గరకు వచ్చేశారు. నాన్న కంటే ముందే నేను పోవాలి అంటావ్ కదమ్మా.. అదే జరుగుతుంది అని ధైర్యం చెప్పారు షర్మిల. అందరూ ప్రేయర్ లో కూర్చున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై నమ్మకం.. విజయమ్మ ధైర్యం అదే..! కానీ..
పాదయాత్ర చేసినట్టే.. కొండల్లోంచి వచ్చేస్తారు.. చెంచుల ఇళ్లలో తలదాచుకుని వచ్చేస్తారు.. చిన్న దెబ్బలతో వచ్చేస్తారనే ఆ రోజు రాత్రి అందరూ అనుకున్న మాటలు. దేవుడి మీద నమ్మకమో.. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం ఏది కోరుకున్నా జరిగిందనే నమ్మకమో.. దేవుడు చెడు చేయడనే నమ్మకమో విజయమ్మను వదల్లేదు. జగన్ తోసహా ఎవరికీ ఎటువంటి అపనమ్మకమూ లేదు. ఆయన వచ్చిన తర్వాత జరిగింది చెప్పించుకోవాలని విజయమ్మ ఎదురు చూస్తూనే ఉన్నారు. రాత్రి.. అర్ధరాత్రి దాటుతోంది. విజయమ్మ మనసులో దిగులు అనిపించినా భయాన్ని ఆమె దరి చేరనివ్వలేదు. ప్రేయర్ లోనే ఉన్నారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న విషయం ఆమెకు తెలీదు.