ట్విట్టర్ ని ఆ జాక్ డార్సీ ఏ ముహూర్తాన, ఏమనుకొని ప్రారంభించాడో… కొత్త కొత్త స్టార్లు పుట్టుకొస్తున్నారు. ఎంతో మందికి ట్విట్టర్ కొత్త జీవితాన్నిచ్చింది.., పునర్జీవితాన్ని.. కాదు, కాదు అప్పనంగా ప్రచారాన్ని ఇచ్చింది..! మెగా సోదరుడు నాగబాబుకు మాత్రం ట్విట్టర్ మూడోసారి జన్మనిచ్చింది. ఒక నరేంద్ర మోడీ, ఒక కేటీఆర్, ఒక నారా చంద్రబాబు… తాజాగా ఒక నాగబాబు..! ట్విట్టర్ ద్వారా రాజకీయాలు నడపవచ్చని, ఉచిత ప్రచారాన్ని పొందవచ్చని మోడీ, కేటీఆర్ నిరూపిస్తే… ట్విట్టర్ ద్వారా సంచలనాలు సృష్టించి.., వార్తల్లో కేంద్ర బిందువుగా మారవచ్చని.., ట్విట్టర్ సెలెబ్రిటీ స్థాయిని సంపాదించవచ్చని నాగబాబు నిరూపిస్తున్నారు. మొత్తానికి నాగబాబుకు జబర్దస్త్ పునర్జన్మని ఇస్తే (నవ్వుల నాగబాబుగా)…, ట్విట్టర్ ఆయనకు మూడో జన్మనిచ్చింది (నవ్వించే నాగబాబుగా).
పూనకంతో ట్వీటు తారేమో…!
ట్వీటినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో మూడ్ లో ఉంటారు. సినీ హీరోలు తమ రీల్ స్టిల్స్, తమ దైనందిన షెడ్యూళ్లు.. ట్విట్టర్ లో పెడుతుంటే.., రాజకీయులు తమ ప్రచారాలు, తమ ఆలోచనలు ట్వీటుతుంటారు. నాగబాబు మాత్రం ట్విట్టర్ లో ఎలా త్వరలో పాపులర్ అవ్వాలో మాంచి ట్రైనింగ్ కి వెళ్లి వచ్చినట్టున్నారు. అందుకే ఆయన ట్వీట్లులో చాలా వరకు సంచలనాల్లాగా, వార్తలకు కేంద్ర బిందువుగా మారుతుంటాయి. గాడ్సే దేశ భక్తుడు, ఆయన వాదనని దేశం పట్టించుకోలేదు.. ఆయన తరపున ఎవరూ ఆలోచించలేదు అంటూ మొన్నామధ్య ఒక ట్వీట్ పెట్టారు. అక్కడితో వార్తల్లోకి వచ్చారు. తన నిండా కప్పుకున్న కాషాయ జెండాతో రకరకాల విన్యాసాలు వేస్తూ టీడీపీని టార్గెట్ చేస్తూ… జనసేనాని ఎత్తుకుంటూ… బీజేపీని మోస్తూ ట్వీట్లు పెడుతున్నారు. మధ్యలో మాత్రం పూనకం వచ్చి… తనలో ఎవరో దూరి ట్వీట్ పెడుతున్నట్టుగా… ఎదుటి వాళ్ళని గిల్లి, గిచ్చేలా పెడుతుంటారు.
సోషల్ మీడియా వార్ కి మూలం…!
నాగబాబు ట్వీట్లు చిత్రంగా ఉంటాయి. కొన్నిటికి అసలు సంబంధం లేని అంశాలు, ఎవరూ మాట్లాడుకొని అంశాలు.., పెద్దగా పట్టించుకోని అంశాలను పెడుతూ తాను బ్రాండ్ అంబాసిడర్ గా మారాలనుకుంటారేమో. అందుకే ఎప్పుడో వదిలేసినా గాడ్సే టాపిక్ ని మళ్ళీ ఎత్తారు. సోషల్ మీడియాలో ఎన్నడూ పోట్లాడుకొని జనసేన, టీడీపీకి కయ్యం పెట్టారు. గడిచిన వారం నుండి ఇటు జనసేన అటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు లాక్కుని, పీక్కుంటున్నారు. ఒకరిపై ఒకరు రకరకాల బురద నీళ్లు చల్లుకుంటున్నారు. మొన్న మే 30 న… ఇక టీడీపీ రాదూ, వచ్చే ఎన్నికల్లో వైసిపి కి, జనసేన కి ఫైట్ అంటూ తేల్చేసి… టీడీపీ ని కెలికారు. ఈరోజు మళ్ళీ ఛత్రపతి శివాజీ, రానా ప్రతాప్, శ్రీ కృష్ణ దేవరాయలు, అశోక చక్రవర్తిలా మనం పిల్లల్ని పెంచాలంటూ మరో ట్విట్టర్ కావ్యాన్ని వదిలారు.
నాడి తెలిసినోడే నాయకుడు…!
జనసేనలో ఉన్నా తమ్ముడి చాటు అన్న… బీజేపీ తో కలిసినా తమ్ముడి తర్వాత ఎక్కడో తన స్థానం. సినిమాల్లో అన్నా, తమ్ముడు కుమ్ముకుపోయారు. జబర్దస్త్ కి వెళ్లి మాంచి పేరొచ్చినా.., మళ్ళీ అక్కడా కయ్యం పెట్టుకుని వచ్చేసారు. అందుకే ఓ దారి చూసుకుని రకరకాల ట్వీట్లు తో రెట్టలు వేస్తున్నారు. నిజానికి నాగబాబు ట్విట్టర్ ఖాతా గత ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించారు. కానీ అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఏడాది మే నాటికి కూడా ఆయనను కేవలం 20 వేల మంది మాత్రమే ఫాలో అయ్యేవారు. కానీ గాడ్సే పోస్టు పెట్టడం తో ట్విట్టర్ లో మజా ఆయనకు తెలిసింహాది. అమాంతంగా 50 వేల మంది కొత్త ఫాలోయర్లు వచ్చి చేరిపోయారు. మళ్ళీ ఇతర ట్వీట్లతో అదనంగా ఫాలోయర్లను సంపాదిస్తున్నారు. ఇదన్నమాట. నాగబాబు జబర్దస్త్ తో రెండోసారి పుడితే… ట్విట్టర్లో వెరైటీ తో మూడోసారి పుట్టినట్టే.