(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
చిత్తూరు: వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజా సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేయించారు.రోజా కారును అడ్డుకుని దాడి చేశారని ఆమె అనుచరులు పోలీసులు ఫిర్యాదు చేయగా 37మందిపై కేసు నమోదు చేశారు. నగరి నియోజకవర్గంలోని కెబిఆర్ పురంలో నిన్న గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి రోజా వెళుతుండగా గ్రామానికి చెందిన పలువురు వైసిపి కార్యకర్తలు ఆమె కారుకు అడ్డుకున్న విషయం తెలిసిందే. పోలీసులు సర్దిచెప్పడంతో కారును అడ్డగించిన కార్యకర్తలు పక్కకు తప్పుకున్నారు.
రోజా అనుచరుల ఫిర్యాదు మేరకు హరీష్, సంపత్, సురేషన్, సరళ, రామ్మూర్తి సహా మరో 30 మందిపై ఐపిసి 143, 341,427,506,509,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత ఎన్నికల్లో స్థానిక నాయకుడు ప్రతాప్ వర్గం తనకు వ్యతిరేకంగా పని చేసిందనీ అందుకే వారిని పక్కన పెట్టాననీ రోజా చెబుతున్నారు. ఇప్పుడు వారే వైసిపి ముసుగులో దాడికి ప్రయత్నించారని రోజా ఆరోపిస్తున్నారు. తనపై దాడికి ప్రయత్నించిన విషయాన్ని సిఎం జగన్ దృష్టికి తీసుకువెళతానని ఆమె చెప్పారు. దీనిపై ప్రతాప్ వర్గీయులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను కాకుండా టిడిపి నుండి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.