Nagarajuna Sagar: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో దెబ్బతిన్న పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలన్నా, తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందనే ప్రచారానికి తెరదించాలన్నా నాగార్జున సాగర్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదనే భావనకు పార్టీ అధిష్ఠానం వచ్చింది. ఆ దిశగానే ‘ఆపరేషన్ సాగర్’ ఫార్ములాను సిద్ధం చేసింది. అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి ఎంపికలో పోటీదారులందరి కంటే కాంగ్రెస్ ముందుంది.
Nagarajuna Sagar: కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటాపోటీ!
నాగార్జున సాగర్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇరుపార్టీలూ బలంగా ఉన్నాయి.2014 ఎన్నికల్లో ఇక్కడ జానారెడ్డి గెలుపొందారు.కానీ 2018 ఎన్నికల్లో జానారెడ్డి ఏడు వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. యాదవ సామాజిక ఓటర్ల మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య యాదవ్ నాటి ఎన్నికల్లో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితా రెడ్డికి నాటి ఎన్నికల్లో 1.8 శాతం (సుమారు 2,600 ఓట్లు) మాత్రమే వచ్చాయి.ఆ తరువాత 2019 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు సాగర్ నియోజకవర్గంలో మూడు వేల మెజారిటీ లభించింది. తర్వాత మే నెలలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 75,050 ఓట్లు సాధిస్తే, కాంగ్రెస్ పోటాపోటీగా 68,871 ఓట్లు సాధించి సవాల్ విసిరింది. అదే సమయంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 64 స్థానాలకు గాను 26 సాధించింది. ఐదూ పదీ ఓట్ల తేడాతో పలు సీట్లు ఓడిపోయింది. గత ఏడాది డిసెంబరులో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించడంతో అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా నర్సింహయ్య సాగర్ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేయలేదన్న భావన స్థానిక ప్రజల్లో ఉంది. జానారెడ్డి హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందనే చర్చ మొదలైంది. పైగా ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్గ విబేధాలతో సతమతమవుతోంది.
టీఆర్ఎస్ కు నిద్రలేని రాత్రులు!
అయితే కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్తో సహా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఈ విమర్శలను సమర్థంగా తిప్పికొడుతోంది .అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని వారు బల్లగుద్ది చెప్తున్నారు. తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని వివరిస్తున్నారు తెలంగాణలో భారీ ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు, ఎస్సార్సీపీ ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే. వీటివల్ల లక్షలాది ఎకరాల బీడు భూములు నేడు నీటితో కళకళలాడుతున్నాయి. ఒక్క నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించిన ఘనత నిస్సందేహాంగా కాంగ్రెస్ పార్టీదే నని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తోంది . టీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నా ఆశించిన స్థాయిలో సాగు నీరు అందడం లేదని,భారీ ఎత్తున అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తోంది. ‘నీళ్లు–నిధులు–నియామకాలు’ ప్రధాన నినాదంగా ఏర్పడిన రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో ఈ మూడు అంశాల్లోనూ విఫలమైందని,అవన్నీ చేసి చూపింది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరించడంలో సఫలీకృతులు అయినట్టే కనిపిస్తోంది .మొత్తంగా చూస్తే సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు దీంతో అధికార టిఆర్ఎస్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది.ఇక ఇక్కడ బిజెపిది నామమాత్రపు పోటీయేనని చెప్పవచ్చు.