రామ్ గోపాల్ వర్మ వరసగా తనకు తోచిన సినిమాలను తీసుకుంటూ వెళ్లిపోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే మూడు సినిమాలను విడుదల చేసిన వర్మ, మర్డర్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రణయ్ హత్యకేసు, అమృత-ప్రణయ్ ల ప్రేమ వ్యవహారం, మారుతీరావులపై వర్మ మర్డర్ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ అమృత, ప్రణయ్ తండ్రి బాలస్వామి నల్గొండ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా విడుదలైతే ప్రణయ్ హత్యకేసుపై ప్రభావం ఉంటుందని, తమను సంప్రదించకుండా ఈ సినిమాను తెరకెక్కించారని, అలాగే తమ కులాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని బాలస్వామి తరుపున న్యాయవాది కోర్టులో వాదించారు. వీరి వాదనలతో ఏకీభవించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది.