హైదరాబాద్: చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ను నిర్బంధించిన ఘటనలో ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో కొండా విశ్వేశ్వరరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 11వ తేదీన జరిగిన ఎన్నికలకు రెండు రోజుల ముందు గచ్చిబౌలిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఒక వాహనంలో పది లక్షల రూపాయల నగదు దొరికింది. వాహనంలో ఉన్న కొండా సందీప్రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.
సందీప్రెడ్డి సితాడెల్ కంపెనీలో ఉద్యోగి అని తెలియడంతో అతనికి నోటీసులు ఇచ్చేందుకు బంజారాహిల్స్లోని కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో కంపెనీ భాగస్వామి అయిన కొండా విశ్వేశ్వర్రెడ్డి వారిని అడ్డుకున్నారు.
సందీప్రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు తన కార్యాలయానికి ఎలా వస్తారంటూ గచ్చిబౌలి ఎస్సై కె.కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావును బెదిరించారు. అంతేకాకుండా తన ఛాంబర్లో బంధించి సిబ్బందితో కలిసి చేయి చేసుకున్నారు. దీంతో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కొండా విశ్వేశ్వర్రెడ్డి తదితరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయిన కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం పోలీసులు గత వారం రోజులుగా బంజారాహిల్స్ తో పాటు ఇతర ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మూడు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు గురువారం దాన్ని తిరస్కరించింది.
కొండా విశ్వేశ్వరరెడ్డికి సమీప బంధువైన సందీప్రెడ్డి ఆయనకు 2008 నుంచి వ్యక్తిగత సహాయకుడిగా, లాయర్గా ఉంటున్నారు.