హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ లో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దోషిగా తేలిన కారు డ్రైవర్ రజనీ కుమార్ కు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ నెలలో డీఏవీ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై డ్రైవర్ రజనీ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల బాలికపై రజనీకుమార్ పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ఈ విషయంపై ప్రశ్నించగా, ప్రిన్సిపాల్ మాధవి తన డ్రైవర్ ను కాపాడేందుకు అనేక మార్లు ప్రయత్నించింది.
ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్ 17న బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్ పై చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 19న రజనీకుమార్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి సంబంధించి సాక్ష్యాధారాలను బంజారాహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. డ్రైవర్ రజనీకుమార్ ను దోషిగా నిర్ధారించిన కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అయితే కారు డ్రైవర్ ను తరగతి గదిలోకి అనుమతించడంపై ప్రిన్సిపాల్ మాధవిపైనా కేసు నమోదు కాగా, ఈ కేసులో ఆమెను నిర్దోషిగా కోర్టు పేర్కొంది.
పాఠశాల గుర్తింపు రద్దు .. కానీ
ఈ ఘటన నేపథ్యంలో డీఏవీ పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తీవ్రంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పాఠశాల గుర్తింపు రద్దు చేశారు. స్కూల్ లో చదువుతున్న పిల్లలను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 700 మంది విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయవద్దనీ, ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆనాడు విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించారు. పిల్లల తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు .. ఈ విద్యాసంవత్సరం వరకూ పాఠశాల గుర్తింపును కొనసాగించాలని నిర్ణయించింది.
సూడాన్ ఘర్షణల్లో 180 మందికిపైగా మృతి.. 1800 మందికి గాయాలు