Nandamuri – Daggubati Families: రక్త సంబంధం ముందు రాజకీయాలు బలాదూర్!ఆమె భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినా, ఆయన టిడిపి శాసనసభ్యుడే కాకుండా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడైనా అంతకంటే ముందే వారిద్దరూ అక్కాతమ్ముళ్లు.అంతకు మించి ఆ ఇద్దరిలో ప్రవహిస్తోంది విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రాముని రక్తమే.
కాబట్టే వారు పొలిటికల్ లైన్స్ పక్కనబెట్టి కుటుంబ సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటున్నారు.అన్యోన్యతను పంచుకుంటున్నారు.ఇప్పుడు వారి మధ్య రాజకీయ పొరపొచ్చాలు లేవు.కుటుంబ సంబంధాలే అక్కడ ప్రస్పుటమవుతున్నాయి.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే?
అఖండ సినిమాతో అద్భుత విజయం సాధించి విజయాల తేరు మీద విహరిస్తున్న టాప్ హీరో నందమూరి బాలకృష్ణ ఆకస్మాత్తుగా సతీసమేతంగా కారంచేడులో ప్రత్యక్షమయ్యారు.తన అక్క, బిజెపిప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి,బావ,రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుల ఆహ్వానం మేరకు సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు బాలయ్య వారి నివాసానికి వచ్చారు.
ఆనాడు తొడగొట్టిన బాలయ్య!
నిజానికి ఒక దశలో పురంధరేశ్వరి కాంగ్రెస్ లో ఉండగా టిడిపి తరపున ప్రచార బాధ్యతలు స్వీకరించిన బాలయ్య అదే కారంచేడులో ఆమె ఇంటిముందు తొడగొట్టి వెళ్లారు.అప్పట్లో ఇది రాష్ట్రవ్యాప్త సంచలనం సృష్టించడమే కాకుండా ఎన్టీఆర్ కుటుంబంలో చర్చనీయాంశమైంది.ఈ ఘటనతో తాను మనస్తాపం చెందినట్లు ఒక ఇంటర్వ్యూలో పురంధరేశ్వరి స్వయంగా చెప్పారు.బాలయ్యను కూడా తాను ఇదే విషయం అడగ్గా ఆయన తనదైన శైలిలో జవాబు దాట వేశారని ఆమె తెలిపారు.అయితే ఇప్పుడు అక్కాతమ్ముళ్లే అంబరాన్నంటే రీతిలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు.
Nandamuri – Daggubati Families: మూడు రోజులుగా కారంచేడు లోనే బాలయ్య!
గురువారం రాత్రి కారంచేడు వచ్చిన బాలకృష్ణ శుక్ర, శనివారాల్లో కూడా ఇక్కడే ఉన్నారు.శుక్రవారం స్వయంగా భోగి మంటలు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కారంచేడులోని ఆలయాలను కూడా ఆయన సందర్శించారు.ఇక శనివారం సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆయన అభిమానులు దగ్గుబాటి నివాసానికి గుర్రం తేగా బాలయ్య దాన్నెక్కి అందరినీ అలరించారు.హార్స్ రైడింగ్ లో బాలయ్య నిష్ణాతుడని అందరికీ తెలుసు.బాలయ్య కదలికలకు అనుగుణంగా గుర్రం కూడా కాళ్లు కదపటం విశేషం.
మొత్తం మీద ఈ ఏడాది కారంచేడులో సంక్రాంతి సంబరాలలో బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కరోనా కారణంగా డాక్టర్ దగ్గుబాటి నివాసంలోకి ఎవర్నీ అనుమతించనప్పటికీ తనను చూడడానికి అభిమానులు గ్రామస్థులు వచ్చినప్పుడు బాలయ్యే బయటకు వచ్చి వారికి అభివాదాలు చేసి వెళుతున్నారు.అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు.దీంతో గ్రామస్థుల ఆనందానికి అవధులు లేవు