చాలా కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనాపై ఏవైతే వ్యాఖ్యలు చేశారో అలాంటివే తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు హిందూపురం శాసనసభ్యుడు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ నోటి వెంట రావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దాంతో సహజీవనం చేయవలసిందేనని వ్యాఖ్యానించడం తెలిసిందే.
అప్పట్లో దీనిపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మొదలుకొని ప్రతిపక్ష నేతలంతా జగన్ మీద విరుచుకుపడ్డారు.ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు కరోనాను నిరోధించలేక సీఎం జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు విమర్శించడం తెలిసిందే.మహమ్మారి కరోనాను జగన్ సీరియస్గా తీసుకోవడం లేదని కూడా వారు దుమ్మెత్తిపోశారు.సరే అది గత చరిత్ర అనుకుంటే తాజాగా నందమూరి బాలకృష్ణ అచ్చుగుద్దినట్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.విర్గో పిక్చర్స్ బ్యానర్పై వస్తున్న సెహారీ సినిమా ఫస్ట్ లుక్ను సోమవారం ఆయన హైదరాబాద్లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరౌనాతో ఎవరైనా సరే సహజీవనం చేయవలసిందేనని ప్రకటించారు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే తప్ప కరోనా రాకుండా ఎవరూ చేసేదేమీ ఉండదని అయన తేల్చి చెప్పారు.అంతటితో ఆగకుండా బాలయ్య కరోనాకు వ్యాక్సిన్ లేదన్నారు అది రాదన్నారు.కరోనా నివారణకు వ్యాక్సిన్ వస్తుందన్న ప్రచారం నమ్మదగినది కాదన్నారు.మాస్కులు ధరిస్తూ ,సామాజిక దూరం పాటిస్తూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ ఎవరికివారే కరోనా రాకుండా జాగ్రత్త పడాలని బాలయ్య సూచించారు.
అడిగితే నిర్మొహమాటంగా మాట్లాడే తత్వం ఉన్న బాలయ్య అదే ధోరణి ప్రదర్శించినప్పటికీ కరోనాపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సపోర్ట్ ఇచ్చేవిగా వున్నాయి. అదే సమయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరికి భిన్నంగా కూడా ఉన్నాయి.సాక్షాత్తు బాలయ్య వియ్యంకుడు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సీఎం జగన్ కు మద్దతుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో బాలయ్య వ్యాఖ్యల విషయమై తర్జన భర్జనలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ వర్గాలు చెప్పాయి. ఇటీవలే నందమూరి బాలయ్య చిన్నల్లుడు భరత్ కు చెందిన విశాఖపట్నం గీతం యూనివర్శిటీలో భవనాల కూల్చివేత జరిగిన నేపధ్యంలో సీఎం జగన్ కు మద్దతుగా బాలయ్య మాటలకు రాజకీయ ప్రాధాన్యం మరింత పెరిగింది.ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.