‘అష్టాచమ్మా’ సినిమాతో నేచురల్ స్టార్ నాని హీరోగా కెరీర్ ప్రారంభించిన సంగతి విదితమే. ఈ సినిమా హిట్ అవడంతో నాని కి వరుస అవకాశాలు వచ్చాయి. తను రెండో సినిమాగా ”రైడ్” అనే సినిమా చేసాడు. ఆ సినిమాలో తనీష్ మరో హీరోగా, అలాగే అక్ష – శ్వేతబసు ప్రసాద్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.
నాని కి మాత్రం ఈ సినిమా మంచి పేరునే తెచ్చిపెట్టింది అని చెప్పొచ్చు. ఈ చిత్రాన్నీ రమేష్ వర్మ తెరకెక్కించగా బెల్లం కొండ సురేష్ నిర్మించారు. అయితే ఈ సినిమా వచ్చిన ఇప్పటికే పదకొండేళ్ల అయ్యింది. ఇప్పుడు, ఇన్ని సంవత్సరాల తరువాత తాను ‘రైడ్’ సినిమాలో బలవంతంగా నటించానని నాని వెల్లడించాడు.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్’ సినిమా ట్రైలర్ ని నాని లాంచ్ చేసాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ”నా కెరీర్ బిగినింగ్ లో ఒకసారి బెల్లంకొండ సురేష్ నా మాట వినలేదు. అప్పుడు ఆయనకు బాగా కలిసి వచ్చింది. ‘రైడ్’ సినిమా చేయనని చెప్పడానికి ఆయన ఆఫీస్ కు వెళ్తే బలవంతంగా నాతో ఆ సినిమా చేయించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. నాకు కూడా ఆ సినిమా బాగా కలిసి వచ్చింది.
ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ చేయమని బెల్లంకొండ సురేష్ అడిగారు. ప్రసాద్ ల్యాబ్స్ లో షూటింగులో ఉంటానని చెప్పాను. అయితే ఆయన నా మాట వినకుండా ప్రసాద్ లాబ్స్ లోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పెట్టి నాతో ట్రైలర్ రిలీజ్ చేయించారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా కలిసి వస్తుందని అనిపిస్తోంది” అని పేర్కొన్నాడు.