కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరి ముఖానికి మాస్క్ ఒక భాగం అయిపోయింది. కరోనా దరి చేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని ప్రధాన మంత్రి మోదీ మొదలుకొని ముఖ్యమంత్రుల వరకు అందరూ సూచిస్తున్నారు. ఈ నేథ్యంలోనే మార్కెట్ లోకి అనేక రకాల మాస్క్ లు వచ్చాయి. అయితే విశాఖకు చెందిన శేషగిరిరావు అనే వ్యక్తి మరి కొందరు సాంకేతిక నిపుణుల సహకారంతో నానో టెక్నాలజీ తో రూపొందించిన మాస్క్ ను ఆవిష్కరించారు. దీనికి నానో ఫోటానిక్ ఫిల్టర్ మాస్క్ – 99గా నామకరం చేశారు. వీరు కొన్ని నమూనా మాస్క్ లు తయారు చేసి అనుమతుల కోసం జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ ఆర్ డి సి), ఐసీఎంఆర్ కు పంపారు. అనుమతులు వచ్చిన తరువాత వీటిని మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఇది ఎన్ -95 మాస్క్ కంటే ఎంతో ప్రయోజనకారి అని మాస్క్ తయారీలో భాగస్వామ్యులైన ఢిల్లీ ఐఐటీలో ఎంటర్ ప్రెన్యూర్ సెల్ విభాగం మాజీ సభ్యుడు కేవీ రమణ, ఆంధ్ర విశ్వవిద్యాలయ జియో ఇంజనీరింగ్ విభాగంలో పోస్ట్ డాక్టోరల్ ఫెలో డాక్టర్ దేముడు, ఎం.ఎస్.ఆర్.లెదర్ ఇండస్ట్రీకి చెందిన శేషగిరిరావులు వెల్లడిస్తున్నారు.
ఈ మాస్క్ లో ప్రత్యేకతలు ఏమిటంటే..
ఈ మాస్క్ లకు ఐదు పొరలను అమర్చారు. మొదటిపొరలో సింథసైజ్డ్ నానో మెటాలిక్ పదార్థాలను కోటింగ్గా వినియోగించారు. రెండో పొరలో సింథసైజ్డ్ ఫొటానిక్ ఉంటుంది. ఫొటానిక్ కారణంగా సమస్యలు తలెత్తకుండా మూడోదశలో రక్షణ పొరను ఉంచారు. వీటి తరువాత సింథసైజ్డ్ నైలాన్ ఫ్యాబ్రిక్ పొర, కాటన్ సింథసైజ్డ్ ఫ్యాబ్రిక్ పొరలు ఉంటాయి. వీటన్నింటినీ దాటి గాలిలోని బ్యాక్టీరియాలు, వైరస్లు శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశాలు 99 శాతం వరకు తగ్గుతాయి. వైరస్, బ్యాక్టీరియా ఆ మాస్క్లోకి చొచ్చుకొస్తే పొరలపై ఉండే పదార్థాల కారణంగా చనిపోతాయి. మాస్క్కు ఒక సింథసైజ్డ్ ఫొటానిక్ బ్లూలైట్ను అమర్చారు. ఇది ముఖంపై మాస్క్ ఆచ్ఛాదన లేని భాగాలపై ఉండే క్రిములను ఆకర్షించి మాస్క్ ఉపరితలానికి వచ్చేలా చేస్తుంది. పైకి వచ్చిన వెంటనే అవి చనిపోతాయి. మాస్క్లో ఒక నానో చిప్, నానోబ్యాటరీ ఉంటాయి. గంట పాటు ఛార్జి చేస్తే ఎనిమిది గంటలు బ్యాటరీ పని చేస్తుంది. మాస్క్ను అరు నెలల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు.