ఏపిలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ప్రారంభం అయిన సందర్భంగా రాయపూడిలో జనభేరి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అంశంపై రెఫరెండంకు సిద్ధమా అంటూ సీఎం జగన్కు సవాల్ విసరడంతో తీవ్ర స్థాయిలో జగన్మోహనరెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నుండి మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. రెఫరెండంలో ఓడిపోతే రాజకీయాల నుండి చంద్రబాబు తప్పుకుంటానని అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు చంద్రబాబు పాలిటిక్స్లో ఎక్కడున్నాడని నాని ప్రశ్నించారు. జూమ్లో సమావేశాలు పెడుతూ పాలిటిక్స్లో ఉన్నట్లు ఫీలు అవుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబును కుప్పంలో ఓడించి రాజకీయ సమాధి కడతామని అన్నారు కొడాలి. భవిష్యత్తులో చంద్రబాబుకు చుక్కలు చూపించడం ఖాయమన్నారు. 74 ఏళ్ల వయసులో ఎన్టిఆర్ కు ఏమి జరిగిందో ఇప్పుడు చంద్రబాబుకు అదే జరుగుతుందని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. టీడీపీని జాతీయ పార్టీ అని ఎలా చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ సర్టిఫికెట్ ఏమైనా ఇచ్చిందా అని అడిగారు. టీడీపీ జాతీయ పార్టీ అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని నాని సవాల్ విసిరారు. టీడీపీ ఒక ఉప ప్రాంతీయ పార్టీ అని నాని ఎద్దేవా చేశారు. గాలి నాయుడు అంటూ తన దైన స్టైల్ లో విమర్శించారు.
నాని వ్యాఖ్యలకు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమరావతి జనభేరితో వైఎస్ జగన్కు మబ్బులు విడిపోయాయన్నారు. ప్రజలు, ప్రాంతీయ పార్టీలు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ అమరావతికి జై కొట్టాయని జనభేరితో తేలిపోయిందన్నారు. చంద్రబాబు సవాల్ స్వీకరించే దమ్ముందా జగన్ రెడ్డి అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఛాలెంజ్కి స్పందించాల్సింది జగనే గానీ జగన్ రెడ్డి గేటు దగ్గర ఊరకుక్కలు కాదంటూ పరోక్షంగా మంత్రి నానిని ఉద్దేశించి విమర్శించారు. అసలే కొడాలి నాని ‘ఆ సంస్కృతం’లో మహా పండితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. సమయం చిక్కినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు లోకేష్ చేసిన విమర్శపై నాని ఇంకెంత రీతిలో ఫైర్ అవుతారో వేచి చూడాలి.