2019 సార్వత్రిక ఎన్నికలలో దారుణంగా ఓడిపోవడంతో టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా అందివచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మళ్ళీ సత్తా చాటాలని పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మళ్లీ ఎలాగైనా బీజేపీతో కలసి పని చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కేంద్రం తో చేతులు కలిపి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని రాజకీయంగా ఇరుకున పెట్టడానికి ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది.
కరోనా వైరస్ సమయంలో మోడీ పెట్టిన ప్రతి మీడియా సమావేశం తర్వాత చంద్రబాబు మోడీ భజన చేయడం జరిగింది. అయినా కానీ బీజేపీ పార్టీ నుండి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఇటువంటి తరుణంలో ఇటీవల బాలయ్య 60వ జన్మదిన వేడుకలు సందర్భంగా కుటుంబమంతా కలిసిన తరుణం లో నారా లోకేష్ తో బీజేపీ పార్టీ నాయకురాలు పెద్దమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి దాదాపు అరగంట పాటు చర్చలు జరిపినట్లు, తాజాగా టీడీపీ కాంపౌండ్ లో వార్తలు వినబడుతున్నాయి. ఈ సందర్భంగా నారా లోకేష్ పురంధేశ్వరితో బీజేపీ తో టీడీపీ పొత్తు గురించి గట్టిగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల పార్టీ నుండి చాలామంది నేతలు ఒక్కొక్కరు జంప్ అవుతున్న తరుణంలో ఇంకా ఎలాగైనా వైసీపీ తో ఢీ అంటే ఢీ అనే లాగా రాజకీయాలు చేయాలని బాలయ్య వేడుకలో నారా లోకేష్, చంద్రబాబు మరియు కుటుంబ సభ్యులు అనుకుంటున్నట్లు టాక్.
ఈ మొత్తం వ్యవహారాన్ని నారా లోకేష్ డీల్ చేసినట్లు అవసరమైతే నందమూరి కుటుంబ సభ్యులంతా కలిసి రాబోయే రోజుల్లో ఆంధ్రాలో టీడీపీ ఉనికి చాటే విధంగా వ్యవహరించాలని బాలయ్య పుట్టినరోజు వేడుకలో చర్చలు జరిపినట్లు మీడియా వర్గాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. చంద్రబాబు వయసు కూడా మీదపడటంతో రాజకీయంగా ఎదగాలంటే కుటుంబమంతా కలవాలని అంతా అనుకున్నట్లు సమాచారం. ఈ వార్త ఎలక్ట్రానిక్ మీడియా లో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో రాష్ట్రంలో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది.