అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలు.. రోజురోజుకు దిగజారిపోతున్న టీడీపీ ప్రతిష్టను కాపాడేందుకు చినబాబు రంగంలోకి దిగబోతున్నట్టు తెలిసింది.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ కుదేలైంది.
వైసీపీ కొట్టిన దెబ్బకు కోలుకోవడం లేదు. మరోవైపు ప్రత్యర్థులంతా కాచుకూర్చున్నారు. బీజేపీ అయితే చంద్రబాబును నిర్వీర్యం చేసి టీడీపీని హైజాక్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలను లాగేసింది. పార్టీ మారిన వారంతా అంతా చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్ చేశాడంటున్నారు. ఇక లోకేష్ పై నమ్మకం లేదని.. జూనియర్ ఎన్టీఆర్ రావాలని కొందరంటున్నారు. ఇక టీడీపీ గడ్డు పరిస్థితుల్లో ఉందని.. బాలక్రిష్ణ సినిమాలు వదిలి ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలని తెలుగుతమ్ముళ్లు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తండ్రిచాటు బిడ్డగా ఎదిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లోకేష్ ఇప్పుడు భావి టీడీపీ నాయకుడిగా నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా లోకేష్ అందరూ వాడిన బ్రహ్మాస్త్రాన్ని కొద్దిగా డిఫరెంటుగా వాడి టీడీపీని గద్దెనెక్కించాలని యోచిస్తున్నాడట.ఆ బ్రహ్మాస్తమ్రే పాదయాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు వైఎస్ జగన్.. అంతా ఒకేబాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు.అయితే లోకేష్ పాదయాత్రకి భిన్నంగా రాష్ట్రమంతా సైకిల్ యాత్ర నిర్వహించే యోచనలో ఉన్నట్లు టిడిపి వర్గాలు చెప్పాయి.
జగన్ పాదయాత్రతో కొల్లగొట్టిన అధికారాన్ని సైకిల్ యాత్ర ద్వారా తిరిగి కైవసం చేసుకోవాలని నారా లోకేష్ పెద్ద ప్లాన్లో ఉన్నారట.2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన పార్టీకి జవసత్త్వాలు నింపేందుకు.. తన నాయకత్వంపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పేందుకు..తన నాయకత్వ పటిమను నిరూపించుకునేందుకు ఇప్పుడు లోకేష్ పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి. కరోనా ప్రభావం తగ్గాక ఈ డిసెంబర్ నుంచి నారా లోకేష్ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. 2022లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని బీజేపీలో జోరుగా ప్రచారం సాగుతుండడంతో వృద్ధుడైన తండ్రికి తోడుగా నారా లోకేష్ ఇప్పుడు రాష్ట్రమంతా సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఈ మేరకు లోకేష్ సైకిల్ యాత్ర రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసే పనిలో టీడీపీ ఉందని తెలిసింది.సొంతంగా ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ బాబు ఇప్పుడు సైకిల్ యాత్రతో టీడీపీ ఇమేజ్ ను ఎంత పెంచుతాడు? ఆయన ఎంత వరకు ఎదిగి టీడీపీని అధికారంలోకి తీసుకొస్తాడన్నది వేచిచూడాలి.అయినా ఇదంతా జరిగినప్పుడు కదా అన్న సెటైర్లు కూడా టిడిపిలో వినిపిస్తున్నాయి.