(ఏలూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా సోమవారం లోకేష్ పార్టీ నేతలతో కలిసి అకీవీడు మండలం సిద్దాపురం గ్రామం వెళ్లారు. గ్రామంలో లోకేష్ ట్రాక్టర్ నడిపారు. అయితే లోకేష్ ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో అదుపుతప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది.
ట్రాక్టర్లో ఉన్న వాళ్లు అదుపుతప్పి కిందపడటంతో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ సమయంలో ట్రాక్టర్పై లోకేష్ పక్కనే ఉన్న ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్ను అదుపు చేసి లోకేష్ ను దింపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఊపిరిపీల్చుకున్నారు. అయితే నారా లోకేష్ ట్రాక్టర్ సవారీపై సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.