అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాలలో వ్యవసాయానికి విత్తనాలు అందక రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అనంతపురం, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాలలో విత్తనాలు సరఫరా చేయాలంటూ రైతులు ధర్నాకూ దిగారు. ఈ విషయంపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని విమర్శించారు.
రైతులకు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి నీళ్లు తెస్తానంటూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలకు వెళ్లారట అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. అనంతపురం, విజయనగరం, నెల్లూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.
రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువులకోసం క్యూలైన్లో ఎదురుచూపులు, లాఠీ చార్జ్లో దెబ్బలు తినాలి అని మరో సారి గుర్తు చేశారని లోకేష్ విమర్శించారు.
ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపన మాని రైతులకు విత్తనాలు అందించే పని మొదలు పెట్టాలని లోకేష్ హితవు పలికారు. విత్తనాల కోసం క్యూలైన్లలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఫోటోలను తన ట్విట్టర్ హ్యాండిల్లో లోకేష్ పోస్టు చేశారు.
రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్ లో ఎదురుచూపులు, లాఠీఛార్జ్ లో దెబ్బలు తినాలి అని మరోసారి గుర్తుచేసారు.
ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపన మాని రైతులకు విత్తనాలు అందించే పని మొదలు పెట్టండి.
— Lokesh Nara (@naralokesh) July 1, 2019