ఏపి ప్రభుత్వం తిరుపతికి చెందిన మహిళా నేతను ప్రభుత్వ సలహదారుగా నియమించింది. నారమల్లి పద్మజ ను స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో సలహాదారుగా ఆమె నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని జివోలో పేర్కొంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ పేరుతో జివో విడుదల అయ్యింది.
ఏపి ప్రభుత్వంలో ఇబ్బడి ముబ్బడిగా సలహదారుల నియామకంపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ ప్రభుత్వ సలహదారు నియామకం విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. సలహాదారులను ఎవరిని నియమించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని తేల్చిచెప్పింది. తాజాగా ఇటీవల కాలంలోనే ఇద్దరు ముగ్గురు నూతన ప్రభుత్వ సలహాదారుల నియామకం జరిగింది. సినీనటుడు ఆలీకి కూడా ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవిని ఇచ్చింది ప్రభుత్వం. తాజాగా తిరుపతికి చెందిన నారమల్లి పద్మజ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.