కరోనా- లాక్ డౌన్ నేపథ్యంలో తెరమీదకు వచ్చిన మారటోరియం విషయంలో తాజాగా కీలక ఘటన తెరమీదకు వచ్చింది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోన్ మారటోరియానికి సంబంధించిన ప్రజలను బాధను కూడా దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో లోన్ మారటోరియాన్ని కేవలం బిజినెస్ కోణంలోనే ఆలోచించడం సరికాదని ప్రజల ఇబ్బందులు పరిగణలోకి తీసుకోవాలని కోరింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్(డీఎంఏ) కింద లోన్ మారటోరియం అంశంపై కేంద్రానికి అధికారాలు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
రుణ మారటోరియానికి సంబంధించి కేంద్రం, ఆర్బీఐ తన అభిప్రాయాన్ని వెల్లడించాలని జూన్ నెలలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా రుణాలుపై మారిటోరియం విధించినా వడ్డీలపై వడ్డీలను వసూలు చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ ఇచ్చిన వెసులుబాటు లోన్ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేయవచ్చా లేదా మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయవచ్చా అనే అంశంపై కేంద్రం నిర్ణీత సమయంలో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని వ్యాపార కోణంలో మాత్రమే ఆలోచించవద్దని, ప్రజల బాధను కూడా పట్టించుకోవాలని సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్య కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల కలిగిందని పేర్కొంది.
కేంద్రానికి అధికారాలు ఉన్నాయి….
యూనియన్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనుక ఉన్నట్లుగా కనిపిస్తున్నదని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. దీనిని వ్యాపార పరంగా మాత్రమే ఆలోచించవద్దని, రిలీఫ్ అవసరమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేసిన ఈఎంఐలపై వడ్డీని వసూలు చేయడాన్ని ఆపివేయడం లేదా మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీని వసూలు చేయడం వంటి వివిధ అంశాలపై నిర్ణయం తీసుకొని బ్యాంకులను ఆదేశించడానికి కేంద్రానికి అధికారాలు ఉన్నాయని తెలిపింది.
వచ్చే నెలకు వాయిదా
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ కేంద్రం, ఆర్బీఐ ఈ అంశంపై కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. కేంద్రం తప్పించుకోవడం లేదని అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచారు. అదే సమయంలో లోన్ మారటోరియంపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. వడ్డీ మాఫీ చేయవచ్చా లేదా తాత్కాలిక నిషేధ సమయంలో వచ్చే వడ్డీపై వడ్డీని వసూలు చేయడాన్ని ఆపివేయవచ్చా అనేది నిర్ణయించుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం కేసును సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.