గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో బిజెపి టిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు భారీ స్థాయిలో పేలుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో బిజెపి పార్టీ హైకమాండ్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఎన్నికల ప్రచారం చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కెసిఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
జరగబోయే గ్రేటర్ ఎన్నికలలో బిజెపిని గెలిపించి తెలంగాణా అభివృద్ధికి పాటుపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ లో కేసీఆర్ ను గద్దె దించే సమయం ఆసన్నమైందని జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో అవినీతి పాలనను అంతమొందించడానికి మోడీ సారథ్యంలో అవినీతి రహిత పాలన ప్రజలకు అందించడానికి బీజేపీ కృషి చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు.
కొత్తపేట నుంచి నాగోల్ వరకు నిర్వహించిన రోడ్ షో సందర్భంగా టీఆర్ఎస్ పాలనపై నడ్డా విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని అన్ని డివిజన్లలోనూ గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో బిజెపి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని కెసిఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతున్నట్లు దాన్ని అంతమొందించడానికి బిజెపి రంగంలోకి దిగినట్లు జేపీ నడ్డా టిఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. కేవలం అవినీతి పాలనలో మాత్రమే కాక అప్పుల లో కూడా తెలంగాణా కూరుకుపోయిందని, ఇప్పుడు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి కొత్త హామీలతో కెసిఆర్ వ్యవహరిస్తున్నారని జేపీ నడ్డా షాకింగ్ కామెంట్లు చేశారు. బీసీ వర్గాలను అదేవిధంగా పేదలను కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని రోడ్ షో లో నగరవాసులకు జేపీ నడ్డా పిలుపునిచ్చారు.