ఫైర్ బ్రాండ్ గా పేరున్న నిర్మాత నట్టికుమార్ మరొకసారి తన గళం విప్పాడు. టాలీవుడ్ ప్రముఖుల పోకడలపై నిప్పులు చెరిగారు.
కరోనా వేళలో థియేటర్ల మూసివేత వల్ల జరుగుతున్న అనర్ధాలు ఏకరువు పెట్టాడు.తన పుట్టిన రోజున సందర్భంగా నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ చాలా కొత్త విషయాలను బయటపెట్టాడు. చిత్ర పరిశ్రమలో కొందరి లాబీయింగ్ వల్లే థియేటర్లు మూతపడ్డాయని తీవ్ర ఆరోపణలు చేశాడు. సినిమా రంగంలో ఎల్ఎల్ఎల్పి అనే సంస్థను 21 మంది నిర్మాతలు ప్రారంభించి సినిమా రంగాన్ని శాసిస్తున్నారని మండిపడ్డాడు.
థియేటర్ల మూతవల్ల అనేక మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. రైళ్లు, విమానాల్లో సీటింగ్ కెపాసిటీ మార్చకుండా ఉన్న వాటితోనే రన్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశాడు. మరి సినిమా థియేటర్ల దగ్గరికి వచ్చే సరికి నిబంధనలు ఎందుకు మారాయి? అని ఆయన ప్రశ్నించాడు. కరోనా కారణం చూపి థియేటర్లు ఓపెన్ చేయకపోతే మున్ముందు అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం మొదలవుతుందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించాడు.
నెలల తరబడి సినిమా హాళ్లు మూసివేత వల్ల పిఠాపురంలోని ఒక థియేటర్లో ఫర్నీచర్ దొంగల పాలైందన్నాడు. అలాగే మరికొన్ని చోట్ల ఎలుకల వల్ల కుర్చీలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా థియేటర్ల మూతవల్లే జరిగిందని, దీనికి బాధ్యులెవరని ఆయన ప్రశ్నించాడు.అంతేగాక ఓటీటీ పై కూడా నట్టికుమార్ ధ్వజమెత్తారు.ప్రధానంగా ఓటీటీల వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయన్నాడు. థియేటర్ల మూసివేత సాకుతో ఓటీటీ ద్వారా పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించాడు.
థియేటర్ల వల్లే హీరోలందరికీ కోట్ల మార్కెట్లు వచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికాడు. నట్టి కుమార్ తాజా వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో కూడా నట్టికుమార్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రత్యేకించి థియేటర్లు కేవలం కొందరి చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయి అని ఆరోపించడం అప్పట్లో పెద్ద వివాదం రేపింది. ప్రముఖ నిర్మాత శ్రీ కళ్యాణ్ పై కూడా నట్టికుమార్ చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనమయ్యాయి. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ నట్టికుమార్ నోరు విప్పారు ఈసారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి!