కోవిడ్ బారిన పడి అత్యవసర స్థితిలో చికిత్స పొందే పేషెంట్లకు ప్రస్తుతం పలు రకాల చికిత్సలను ఉపయోగిస్తున్నారు. ప్లాస్మా థెరపీ, స్టెరాయిడ్ల వాడకం, రెమ్డెసివిర్ డ్రగ్ ఇవ్వడం చేస్తున్నారు. అయితే ఇవే కాకుండా మరో మెడిసిన్ కూడా కోవిడ్ ఎమర్జెన్సీ పేషెంట్లకు చక్కగా ఉపయోగపడుతుందని తేల్చారు. స్వీడన్కు చెందిన పరిశోధకులు ఈ విషయమై కొందరు కోవిడ్ ఎమర్జెన్సీ పేషెంట్లకు సదరు మెడిసిన్ ఇవ్వగా.. వారందరూ చాలా త్వరగా కోలుకున్నారని వెల్లడైంది.
స్వీడన్లోని కరోలిన్స్కా యూనివర్సిటీ హాస్పిటల్కు చెందిన పరిశోధకులు అక్కడ కోవిడ్ చికిత్స పొందుతున్న 87 మంది ఎమర్జెన్సీ పేషెంట్లకు టొసిలిజుమాబ్ అనే ఆర్థరైటిస్ మెడిసిన్ను ఇచ్చారు. దీంతో వారు ఇతర కోవిడ్ రోగుల కన్నా చాలా త్వరగా కోలుకున్నారు. అలాగే ఐసీయూ, వెంటిలేటర్లపై ఉండే సమయం కూడా తగ్గింది. కేవలం 10 రోజుల్లోనే వారు కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. అందువల్ల ఆ మెడిసిన్ కోవిడ్ ఎమర్జెన్సీ పేషెంట్ల చికిత్సకు పనికొస్తుందని, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించవచ్చని అంటున్నారు.
కాగా పరిశోధకులు చేపట్టిన సదరు ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లోనూ ప్రచురించారు. కోవిడ్ ఎమర్జెన్సీ పేషెంట్లలో శరీరంలో అంతర్గతా కణాల వాపు ఎక్కువగా ఉంటుంది. అయితే ఆర్థరైటిస్లోనూ కణాల వాపు సమస్య కనిపిస్తుంది. అందువల్ల ఆర్థరైటిస్ చికిత్సకు వాడే ఆ మెడిసిన్ కోవిడ్ పేషెంట్ల చికిత్సకు కూడా పనికొస్తుందని సైంటిస్టులు తెలిపారు. దీనిపై వారు ప్రస్తుతం మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.