టీవీ ఉత్పత్తుల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సాంసంగ్ దేశీయ మార్కెట్ లోకి సరికొత్త టీవీలను విడుదల చేసింది. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం రెస్టారెంట్లు, రిటైల్ షాపులు, షాపింగ్ కాంప్లెక్సులు, సెలూన్లు, స్టోర్ల కోసం ప్రత్యేక బిజినెస్ టీవీలు రూపొందించింది. అల్ట్రా హై డెఫినిషన్ (యూహెచ్ డీ) టెక్నాలజీతో రూపొందించిన ఈ టీవీలను శుక్రవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఈ స్మార్ట్ టీవీలు వరుసగా 43, 50, 55, 70 అంగుళాల వేరియంట్లలో లభిస్తాయి. వీటి ధరలు రూ.75,000 నుంచి 1,75,000 వరకూ ధరలు నిర్ణయించారు. ఈ టీవీలు మూడేళ్ల వారంటీతో వస్తాయని కంపెనీ ప్రకటించింది. సొంత కంటెంట్ను సృష్టించేందుకు అనుగుణంగా 100 ఉచిత టెంప్లేట్లతో టీవీలు ప్రీలోడెడ్గా అందిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. తమ కొత్త ఉత్పత్తులు చిన్న, మధ్య తరహా వ్యాపారవర్గాలకు అందుబాటులో ఉండేలా రూపొందించామని కంపెనీ వెల్లడించింది.
కొత్త శాంసంగ్ బిజినెస్ టీవీలు చిన్న, మధ్య తరహా వ్యాపారాల అవసరాలను తీరుస్తాయని భావిస్తున్నామని శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పునీత్ సేథీ వెల్లడించారు. పని ప్రదేశంలో వారికి ఉల్లాసంగా వినియోగించుకునేలా ఈ టీవీలు రూపొందిచినట్టు తెలిపారు. శాంసంగ్ బిజినెస్ టీవీలను సులభంగా ఇన్స్టాల్ చేసుకునే విధంగా 3 దశల గైడ్తో వస్తుందన్నారు. తద్వారా ఇన్స్టాలేషన్కు అదనపు చార్జీలు లేకుండా.. టీవీని ఆన్ చేసినప్పుడు స్వయంగా ఆన్ అవుతుందని శాంసంగ్ ప్రకటించింది.