కరోనా వైరస్ కేసులు విపరీతంగా విస్తరిస్తున్న ఈ నేపథ్యం లో ఈ మహమ్మారి కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకొని వచ్చేందుకు ప్రయోగాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలకు సమాంతరంగా కరోనా వైరస్ పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే పాజిటివ్ కేసులను వేగంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం అనుసరిస్తున్న కరోనా పరీక్షలలో సమస్యలను అధిగమించే నూతన విధానాలపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
కరోనా నిర్ధారణ కోసం ప్రస్తుతం గొంతు, ముక్కుల ద్వారా నమూనాలు (శ్వాబ్) సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పద్ధతిలోనే పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల సమయంలో శాంపిల్స్ సేకరణకు అనుభవం ఉన్న వైద్య సిబ్బంది ఉండాలి. అత్యంత జాగ్రత్తలు పాటించాలి. దీనికి తోడు సేకరించిన శాంపిల్స్ భద్రపరచడం, రవాణా చేయడంలోనూ పలు ఇబ్బందులు ఉంటాయి. ఈ పరీక్షలకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఫలితం రావడానికి సమయం పడుతుంది. ఈ కరోనా టెస్ట్ కు భారత దేశంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 2200 వరకు వసూలు చేస్తున్నారు. ఈ కరోనా పరీక్ష నిర్ధారణలో 70శాతం మాత్రమే ఖచ్చితత్వం.
కాగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కరోనా పరీక్షా విధానం 90శాతం ఖచ్చితత్వం, ఖర్చు తక్కువ. వేగవంతంగా పరీక్ష పూర్తి అవుతుంది. కేవలం ఒక డాలర్ నుండి నాలుగు డాలర్ లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.100 ల నుండి రూ. 350లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. “సలైవా డైరెక్ట్” కరోనా టెస్ట్ విధానంలో నోటి నుండి లాలాజలం తీసుకొని పరీక్ష చేస్తారు. కరోనా కోవిడ్ 19 వైరస్ నిర్ధారణలో ఈ సలైవా డైరక్ట్ టెస్ట్ చాలా సురక్షితం అని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి ఎఫ్డీఏ అనుమతి లభించింది. ఈ కొత్త విధానం ద్వారా వేగంగా, కచ్చితత్వంతో కరోనా వైరస్ నిర్ధారణకు అవకాశం ఉంది. కరోనా టెస్టుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో శాంపిల్ సేకరణ కు ఆరోగ్య సిబ్బంది అవసరం ఉండదు. నేరుగా పేషెంట్ శాంపిల్ తీసుకుని వెళ్లి పరీక్ష చేయించుకోవచ్చు. అమెరికా వ్యాప్తంగా కొద్ది వారాల్లోనే ఈ నూతన కరోనా పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కు ద్వారా తీసుకొనే నమూనాల కంటే ఈ నూతన పద్ధతిలో తక్కువ హాని ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కొవిడ్-19 వైరస్ నిర్ధారణలో ఈ కొత్త విధానం “గేమ్ ఛేంజర్” గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సలైవా డైరెక్ట్ పరిశోధకులు నాథన్ గ్రూబౌగ్, అన్నే వైలిలు. ఈ కరోనా టెస్ట్ లు మన దేశానికి రావడానికి ఇంకొద్ది కాలం పట్టవచ్చు.