KCR New Steps: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు ఏ విధమైన ఎత్తుగడ వేస్తారో ఎవరికీ అర్థం కాదు. అత్యవసర సందర్భాల్లో కేసీఆర్ వ్యవహారశైలి అనూహ్యంగా ఉంటుంది.ఫామ్ హౌస్ లో పడుకుంటాడు… ప్రగతిభవన్ కి రాడు.. ప్రజలు ఆయనకు పట్టరు అంటూ విమర్శలు గుప్పించే ప్రతిపక్షాలు నోరు తెరవలేని విధంగా కెసిఆర్ చర్యలు ఉంటాయి.
ఒక్కసారిగా ఆయన ప్రతిపక్షాలకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంటాడు.ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.తెలంగాణలో కరోనా వీర విహారం చేస్తోంది…కానీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని ప్రతిపక్షాలు మైక్ పట్టుకుని ప్రచారం సాగిస్తున్నాయి.కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గాంధీనగర్ తన రాజకీయ అడ్డాగా చేసుకుని అక్కడ అన్నదానాలు అంటూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా తనను అడ్డుకున్న పోలీసులపై కూడా ఎంపీ రేవంత్ ఫైర్ అవ్వడం అదొక వివాదంగా మారడం తెలిసిందే.ఇదిలా సాగుతుండగానే కేసీఆర్ తన మార్కు రాజకీయం ప్రారంభించారు.అకస్మాత్తుగా ప్రభుత్వాసుపత్రుల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు.కరోనా రోగులను ఆయన నేరుగా పరామర్శించడం ద్వారా వారి మన్ననలను పొందటం తోపాటు ప్రతిపక్షాలకు కూడా వాయిస్ లేకుండా చేసే స్కెచ్ వేశారు.
గాంధీ హాస్పిటల్ తో నాంది!
ముఖ్యమంత్రి తలుచుకుంటే ఇక అడ్డేముంటుంది.బుధవారం నాడు రాజువెడలె రవితేజములలరగ అన్నట్లు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కలియతిరిగారు.కరోనా రోగులను పరామర్శించారు వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు.కరోనా రోగులకు కాసింతైనా కష్టం కలగకూడదంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు.విచిత్రమేంటంటే కరోనా రోగుల ఎవరూ కూడా ముఖ్యమంత్రి సమక్షంలో ఏ సమస్యనూ ప్రస్తావించలేదు.తాము చాలా ఆనందంగా ఉన్నట్లు ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలు, చికిత్స బాగున్నట్టు కరోనా రోగులు హావభావాలు వ్యక్తం చేశారు.దీంతో కరోనా ను డీల్ చేసే విషయంలో తన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కెసిఆర్ సమర్థంగా తిప్పికొట్టగలిగారు.
రేపు వరంగల్ ఎంజీఎంకు సిఎం కెసిఆర్!
ఇదేదో బాగుందనుకున్న కెసిఆర్ ఇంకో ప్రభుత్వాస్పత్రి సందర్శనకు బయలుదేరారు.శుక్రవారం ఆయన వరంగల్ లోని ప్రముఖ ఆసుపత్రి ఎంజీఎంను సందర్శించి కరోనా రోగులను పరామర్శించనున్నారు.హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా తర్వాత తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి వరంగల్ ఎంజీఎం.దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ తన రెండో పర్యటనను ఈ ఆస్పత్రిలో పెట్టుకున్నారు.అక్కడ కూడా కెసిఆర్ తన ఇంద్రజాలాన్ని ప్రదర్శిస్తారనడంలో సందేహం లేదు.మొత్తం మీద కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు విలవిలలాడుతున్నాయనే చెప్పాలి.