Andhra Pradesh: జనగణన పూర్తయ్యేదాకా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉన్న జిల్లాలు,పట్టణాలు గ్రామాల భౌగోళిక సరిహద్దులను మార్చకూడదంటూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ)ఇచ్చిన ఫ్రీజింగ్ ఉత్తర్వులు అమల్లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
చకచకా పావులు కదపటమే కాకుండా రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపి ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసేశారు.అయితే కేంద్రం ఇచ్చిన ఫ్రీజింగ్ ఉత్తర్వులు అమల్లో ఉండగా కొత్త జిల్లాల నోటిఫికేషన్ ఎలా ఇస్తారు సాంకేతికంగా,చట్టబద్ధంగా ఇది చెల్లుబాటు అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Andhra Pradesh: జూన్ 2022 వరకు అమల్లో ఫ్రీజింగ్!
కేవలం ఇరవై రోజుల క్రితమే ఈ ఏడాది జనవరి మూడో తేదీన రిజిస్ట్రార్ జనరల్ అఫ్ ఇండియా రాష్ట్రాలలో కొత్త యూనిట్ల(జిల్లాలని అర్థం)ఏర్పాటుపై ఫ్రీజింగ్ ను 2022 జూన్ వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చినట్లు హిందూ,ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ ఆంగ్ల దినపత్రికలలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి.ఈ ఫ్రీజింగ్ ను ఇప్పటికిలా పొడిగించడం ఇది మూడోసారి.
ఫ్రీజింగ్ ఎందుకంటే!
కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండే డేటాబేస్ లో 2015 నాటి జనాభా లెక్కలు వారి వారి నివాస ప్రాంతాల ప్రాతిపదికన సేకరించి నిక్షిప్తం చేశారు.తాజాగా 2021 లో జనగణన చేసే ముందు కొత్త జిల్లాల ఏర్పాటు వంటి చర్యల ద్వారా భౌగోళిక సరిహద్దులను మారిస్తే కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశ్యంతో జనాభా లెక్కింపు పూర్తయ్యే వరకు దేశవ్యాప్తంగా ఆర్జీఐ ఫ్రీజింగ్ విధించింది.ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎప్పుడో జన గణన పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి కారణంగా అంతులేని జాప్యం జరిగింది.ముందుగా 2020 డిసెంబర్ 31 వరకు ఫ్రీజింగ్ విధించారు.తదుపరి డిసెంబర్ 31,2021 వరకు పొడిగించారు.మళ్లీ కరోనా ఉధృతం కావడంతో 2022 జూన్ వరకు మరోసారి ఫ్రీజింగ్ ను పొడిగిస్తూ ఆర్జీఐ పదిహేను రోజుల క్రితమే ఉత్తర్వులిచ్చింది.
లేడికి లేచిందే పరుగా?
ఈ నేపధ్యంలో అధికారికంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి వీల్లేదని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి.కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వం తీరు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఉందని అధికార వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.ఫ్రీజింగ్ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా అది సాంకేతికంగా చెల్లుబాటు కావని వారు అనధికారికంగా చెబుతున్నారు.మరి జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ఏ ప్రాతిపదికన ముందుకుపోతోందో ఎవరికీ బోధపడటం లేదు.