ప్రస్తుతం ఏపీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే.. అది కచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారమనే చెప్పాలి! రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ వ్యవహారంపై ఇక క్లారిటీ తెచ్చుకునే పనికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కమిషనర్ గా పునర్నియమించాలన్న హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు వెళ్లి ఆ విషయాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టిన జగన్ సర్కార్… సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తుందని ఆశిస్తోంది. నిజంగా జగన్ ఆశించినట్లు అదే జరిగితే.. కొత్త కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ను నియమించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీకి ఎన్నికల కమిషనర్ ఉన్నట్లా. లేనట్లా అనే అనుమానం అందరికీ ఉంది! రమేశ్ కుమార్ ను పునర్నియమించడం జగన్ కు ఇష్టం లేదు.. జగన్ నియమించిన జస్టిస్ కనగరాజ్ ను హైకోర్టు వద్దంది! దీంతో కమిషనర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో… స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండడం, రాజ్యాంగబద్ధమైన పదవి ఖాళీగా ఉండకూడదన్న నియమాలను అనుసరించి.. వీరిద్దరూ కాకుండా మూడో వ్యక్తిని కమిషనర్ గా నియమించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా హైకోర్టు ఓ తీర్పు వెలువరించి.. ఇన్ని రోజుల్లో అమలు చేయాలని తీర్పులో చెప్పని పక్షంలో ఆ తీర్పు అమలుకు 2 నెలల వ్యవధి ఉంటుందని అడ్వకేట్ జనరల్ చెబుతున్న పరిస్థితుల్లో… నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదనే అనుకోవాలి. ఇదే సమయంలో రాజ్యాంగబద్ధమైన పదవి కూడా ఖాళీగా ఉండకూడదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలని వాదన వినిపించడం.. దానికి తగ్గట్లుగా పంచాయతీరాజ్ చట్టంలో అలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో కమిషనర్ పోస్టు ఖాళీ అయితే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండేలా చట్టాన్ని సవరించి.. తద్వారా మరో ఆర్డినెన్స్ జారీచేసి.. దాని ప్రకారం మన్మోహన్ ను నియమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరుగుతున్నాయంట! ఇదే జరిగితే నిమ్మగడ్డ స్థానే మన్మోహన్ వస్తారన్నమాట!