వాట్సాప్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు చాలా తక్కువ. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లు కలిగిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఫేస్బుక్, ఇన్స్టా వంటి యాప్స్ కంటే వాట్సాప్కు యూజర్లు అత్యధికం. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను తీసుకువస్తూ యూజర్లకు అందుబాటులో ఉంటుంది వాట్సాప్. అయితే ఈసారి మాత్రం తన యూజర్లకు షాక్ ఇవ్వబోతుంది. వచ్చే సంవత్సరం నుంచి వాట్సాప్ కొత్త నిబంధనలు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వాట్స్ ప్ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించకపోతే అకౌంట్ డిలీట్ అయిపోనుంది.
సాధారణంగా వాట్సాప్ పరీక్షా దశలో లేదా ఇంకా విడుదల చేయని ఫీచర్స్ పై వ్యాఖ్యానించదు. కానీ ఈ సారి కొత్తగా త్వరలో తీసుకురాబోయే టర్మ్స్ అండ్ కండీషన్స్ను షేర్ చేసింది. 2021 ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ కొత్త నిబంధనలు తీసుకురానుంది. అయితే ఈ నూతన టర్మ్స్ అండ్ కండీషన్స్ను అంగీకరించని వారి ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని సంస్థ తన బ్లాగ్ ద్వారా స్పష్టం చేసింది. ఆ టర్మ్స్ అండ్ కండీషన్స్ స్క్రీన్ షాట్స్ ను బీటా ఇన్ఫోలో షేర్ చేసింది. ‘నూతన నిబంధనలను అంగీకరించండి లేకపోతే మీ వాట్సప్ ఖాతాను డిలీట్ చేసుకోండి’ అని ఆ స్క్రీన్ షాట్లలో ఉంది. ఈ స్క్రీన్ షాట్ ప్రకారం వాట్సాప్ కొత్త అప్డేట్ సమాచారంతో యూజర్ డేటాను వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్బుక్ ఎలా ఉపయోగిస్తుందనేది ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఫేస్బుక్ కు సంబంధించిన అన్ని రకాల సేవలతోపాటు, ఛాటింగ్ సమాచారాన్ని, వ్యాపారాలకు దీన్ని ఎలా ఉపయోగిస్తారనేది కూడా అందులో తెలియజేయనున్నట్లు తెలిపింది. తొందర్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ కొత్త నిబంధనలను విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
19 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా ఫేస్బుక్ 2014లో కొనుగోలు చేసినప్పటి నుండి ఇది ఎలా పనిచేస్తుందనే దానిపై వాట్సాప్ విమర్శలను ఎదుర్కొంది. యూజర్ల గోప్యత, డేటా భద్రతా గురించి అనేక విమర్శల మధ్య 2018లో వాట్సాప్ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేశారు. వాట్సాప్ను ఫేస్బుక్ అమ్మకానికి ముందు జాన్ కౌమ్.”ఈ రోజుల్లో కంపెనీలు మీ గురించి, మీ స్నేహితులు, మీ ఆసక్తుల గురించి అక్షరాలా ప్రతిదీ తెలుసు, వారు ప్రకటనల అమ్మకం కోసం ఇవన్నీ ఉపయోగిస్తారు” అని ఫేస్బుక్ అమ్మకానికి ముందు బ్లాగ్ పోస్ట్లో రాశారు.