ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేసే ప్రతి అవకాశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తాజాగా మరో కీలక అంశంలో ముఖ్యమంత్రి జగన్ టీంను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా విషయంలో ఏపీలో మరోమారు సర్కారును ఇరుకున పడేసింది. గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో టీచర్లు, విద్యార్థులకు కరోనా సోకిందన్న వార్తల నేపథ్యలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే, తెలుగుదేశం పార్టీకి అధికార వైసీపీ సైతం తగు రీతిలో స్పందించింది.
పాఠశాలల్లో కరోనా కలకలం
వివిధ జిల్లాల్లో పాఠశాలలోని విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకిందనే వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలో 52 మందికి కరోనా సోకడం ఆందోళన కలిగించింది. 46 మంది టీచర్లు, నలుగురు సిబ్బంది, ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడం కలకలం కలిగించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ స్పందించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సూచించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని సూచించారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలలు తెరవాలనే నిర్ణయాన్ని వెనుక్కు తీసుకుని కరోనా బారిన పడ్డ విద్యార్ధులు, ఉపాధ్యాయులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కోరారు.
ఆరోగ్య మంత్రి అలర్ట్
కాగా విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణపై ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం కావడంతోముందోస్తుగా ర్యాండంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సునందతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని కరోనా నిర్ధారణ అయిన విద్యార్థులను హోమ్ ఐసోలేషన్ లో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు వెలువరించారు.
దేశంలో ఏం జరుగుతోందంటే…
ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండో దశ ప్రారంభమైంది. లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. విద్యార్ధుల రక్షణ నేపథ్యంలో పలు దేశాల్లో పాఠశాలల నిర్వహణ వాయిదా వేశారు. మన దేశంలో కూడా 22కు పైగా రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవలేదు. ఆన్ లైన్ లోనే విద్యార్ధులకు బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశమంతటా గ్రామీణ ప్రాంతాల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే విద్యార్ధులకు వైరస్ ను ఎదుర్కొనే శక్తి కూడా ఉండదు. సరైన అవగాహన లేక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధుల ద్వారా తల్లిదండ్రులకు కూడా కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో పాఠశాలలను ప్రారంభించడం విద్యార్ధుల, ఉపాధ్యాయుల, ఆయాల, మధ్యాహ్న భోజన సిబ్బంది ప్రాణాల విషయంలో ప్రభుత్వం పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.