నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు కామెంట్లతో నరసాపురం నియోజకర్గం వార్తల్లోకి ఎక్కుతోంది.
అయితే, తాజాగా మరో కీలక పరిణామంతో ఈ నియోజకవర్గం అందరి దష్టిని ఆకర్షిస్తోంది. అదే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నరసాపురం లోక్సభ స్థానం పార్టీ పగ్గాలను మహిళా నేత సీతారామలక్ష్మికి అప్పగించడం ద్వారా.
లెక్కలు వేసుకొని మరీ…
నరసాపురం ఎంపీ బాధ్యతలు అప్పగించడంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలంగా వ్యవహరించింది. సామాజికవర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం అడుగులు కదిపింది. ఇప్పటికే ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పార్టీకి అండదండలు ఇస్తున్న సీనియర్లు బలమైన కేడర్ ఎలాగో ఉంది కాబట్టి సజావుగా పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపించడానికి వీలవుతుందని పార్టీలో కొందరు సీనియర్లు సీతరామలక్ష్మీకి ధైర్యం చెప్పారు. జిల్లాకు 11 ఏళ్ళ పాటు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన తాను కేవలం ఒక లోక్సభ స్థానానికి పగ్గాలు స్వీకరించలేనన్నట్లుగా సీతారామలక్ష్మి ఒకింత వెనుకంజ వేశారు.
ఆమె పదవి ఇవ్వడం వెనుక….
సీతారామలక్ష్మీకి పదవి విషయంలో అనేక సమీకరణాలు ఉన్నాయంటున్నారు. సీతారామలక్ష్మీ తన అనాసక్తిని వ్యక్తం చేసిన తరుణంలో తాజాగా ఆమెతో చర్చించిన పార్టీ అధినేత చంద్రబాబుకు దాదాపు పలు వివరాలు వివరించారు. అనంతరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలిగా పార్టీ అధినేత చంద్రబాబు సీతరామలక్ష్మికి పగ్గాలు అప్పగించారు. ఈ లోక్ సభ స్థానం పరిధిలోనే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, ఉండిలో రామరాజు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీలుగా మంతెన సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్ ఎలాగూ ఉన్నారు. వీరితోపాటు చురుకైన మాజీ ఎమ్మెల్యేలు మాధవ నాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ, ఇప్పటికీ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నారు.
రాజుగారి కోటాలో తెలుగుదేశం స్కెచ్
నరసాపురం పార్లమెంటు నియెజకవర్గం రాజుల కోటగా ప్రసిద్ధి పొందింది. ప్రస్తుత ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం ఇదే లెక్కల ప్రకారం గెలుపొందారు. అయితే, అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విబేధించి తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతున్నారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే వరకూ పరిస్థితి చేరిపోయింది. అయితే దీనిపై రఘురామకృష్ణంరాజు ఘాటుగానే స్పందించారు. పార్టీ తనను దూరం పెడుతోందని.. తనతో ఎంపీలు ఎవరూ మాట్లాడం లేదన్నారు. ఇంకెన్ని రోజుల ఈ నాటకాలు.. దైర్యం ఉంటే తనను పార్టీ నుంచి పంపించివెయ్యొచ్చుగా అని ఎంపీ రఘురామ సవాల్ చేశారు. అదే సమయంలో పార్టీ పెట్టే ఉద్దేశం, ఆలోచన తనకు లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తాను ఇప్పటికీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్నారు. ఇలా రఘురామ కృష్ణంరాజు కామెంట్ల పరంపర కొనసాగుతున్న తరుణంలో సీతారామలక్ష్మికి పగ్గాలు అప్పగించడం ద్వారా తెలుగుదేశం కొత్త ఎత్తుగడకు తెరలేపిందని అంటున్నారు.